Hyderabad: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 60 ఏళ్ల ఆకాంక్ష.. సుదీర్ఘ పోరాట ఫలితం. సబ్బండ వర్గాల ఐక్య ఉద్యమం. వందల మంది ప్రాణ త్యాగం ఫలితం. 2014 జూన్ 2 మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. స్వప్నం సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. పది జిల్లాలో తెలంగాణ ఏర్పడగా, 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది.
పదేళ్లలో అభివృద్ధి..
తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, నక్సలిజం పెరుగుతుందని నాటి సమైక్య పాలకులు విమర్శలు చేశారు. పాలించడం చేతకాదని విమర్శలు చేశారు. కానీ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నారు. అనేక పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టి అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. తలసరి ఆదాయంలో కూడా దేశంలో 3వ స్థానంలో నిలిచింది.
విశ్వనగరంగా హైదరాబాద్..
ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఐటీ అభివృద్ధితోపాటు ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్ లాంటివి వాటి ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్కు వచ్చాయి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 70 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర ప్రజలు హైదరాబాద్తో సంబంధాన్ని కలిగి ఉన్నారు.
ముగియనున్న ఉమ్మడి రాజధాని కాల పరిమితి..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో హైదరాబాద్ను పదేళ్లపాటు తెలంగాణ, హైదరాబాద్కు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024, జూన్ 1తో ఆ గడువు ముగియనుంది. తెలంగాణ సొంతం కాబోతోంది. అయితే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లోని నేతలు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు కలిపి ఇప్పుడు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ రహస్య అజెండా అమలు చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏంటా రహస్య ఎజెండా..
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని బీఆర్ఎస్ అంటోంది. హైదరాబాద్ ఆదాయాన్ని ఒక్క ప్రాంతానికి పరిమితం చేసి మిగత జిల్లాలను ఒంటరి చేయాలని చూస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పేరుతో రాష్ట్రంలో అశాంతి రగిలించే కుట్ర చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. రహస్య అజెండా అమలు కోసమే తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను బరిలో దించిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ను బలహీనపర్చడం ద్వారా తెలంగాణపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
యూటీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు?
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న బీజేపీ కుట్రకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్పై కోపం, అక్కసుతోనే వారు అలా చేస్తున్నారని పేర్కొంటున్నారు. హైదరాబాద్ను యూటీగా మారితే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు హైదరాబాద్ అడ్డాగా మారుతుందని ఆరోపిస్తున్నారు.
నిజమెంత..?
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ను యూటీ చేయాలన్న ప్రతిపాదనలో నిజమెంత అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. బీఆర్ఎస్ ఆరోపణలు మినహా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేల బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు అదే జరిగితే తెలంగాణ మళ్లీ అగ్నిగుండం కావడం ఖాయం. ఈ విషయం రెండు జాతీయ పార్టీలకు తెలుసు. ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే దుస్సాహసం చేయవని మరికొందరు అభిప్రాయపడుతన్నారు.