China Couple: మనదేశంలోనే కాదు.. ఏ దేశంలో నైనా సరే పెళ్లయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అని చుట్టుపక్కల వారు కచ్చితంగా అడుగుతారు. సకాలంలో పిల్లలు పుడితే ఇబ్బంది లేదు. ఒకవేళ పిల్లలు కలగకపోతే ఎదుర్కొనే మానసిక వేదన మామూలుగా ఉండదు. అది అనుభవించిన దంపతులకే తెలుస్తుంది.
ఈ దంపతులకు కూడా పిల్లలు లేరు. పెళ్లయి చాలా కాలం అయినప్పటికీ పిల్లలు కలగకపోవడంతో వారు పడిన వేదన మామూలుది కాదు. చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అనేవారు. బంధువులు కూడా రకరకాల ప్రశ్నలు వేశారు. సరోగసి కి వెళ్లాలంటే ఆ దేశంలో నిబంధనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏం చేయాలో తెలియదు.. దత్తత తీసుకోవాలంటే మనసు ఒప్పలేదు. ఇక ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు లేని లోటును భర్తీ చేసుకోవడానికి వినూత్నమైన విధానాన్ని అవలంబించారు. ప్రపంచంలోనే ఈ నిర్ణయం తీసుకున్న ఏకైక జంటగా ఆవిర్భవించారు.
చైనా దేశంలో జో జియో లిన్.. యిన్ జీ అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి జరిగే చాలా సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కలగలేదు. దీంతో వీరు జువాన్ లాంగ్ ఏరియాలో దాదాపు 197 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో పుష్పించే జాతికి సంబంధించిన మొక్కలను నాటారు. అద్భుతమైన గార్డెన్ నిర్మించారు. దీని నిర్మాణానికి 2013లో పునాది పడింది. ఈ మొక్కలతో ఆ దంపతులు బలమైన అనుబంధాన్ని పెంచుకున్నారు. అయితే ఇందులో పుష్పించే మొక్కలంటే యిన్ జీ కి చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఒకసారి ఆమె తన భర్తకు చెప్పారు. భార్య కోరిక మేరకు ఆయన ఒక తోటను నిర్మించాలని అప్పుడే అనుకున్నారు.. వెంటనే తన ఇంటిని అమ్మేశారు. భూమిని కొనుగోలు చేశారు. అనేక దేశాల నుంచి విత్తనాలు తెప్పించుకున్నారు. ఒక లోయ లాంటి ప్రాంతాన్ని క్రమంగా విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పించే మొక్కల తోటను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ పూల తోట మధ్యలో ఒక చిన్నపాటి ఇంటిని నిర్మించుకున్నారు. అందులోనే ఆ దంపతులు జీవిస్తున్నారు. ఒకరికి ఒకరు అన్నట్టుగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.
పిల్లలు లేరని బాధపడినప్పటికీ.. ఇప్పుడు ఈ తోటలో పనిచేస్తుంటే ఆ బాధ లేదని ఆ దంపతులు చెబుతున్నారు. పుష్పించే మొక్కల్లోనే తమ పిల్లలను చూసుకుంటున్నామని వారు అంటున్నారు. ఆ పువ్వులను చూస్తే తమ బాధను మొత్తం మర్చిపోతున్నామని వారు చెబుతున్నారు. విస్తారమైన 197 ఎకరాలలో ఈ స్థాయిలో పుష్పించే మొక్కలు ఉండడం.. అది కూడా ఒకే చోట ఉండడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో పూల తోట ఎక్కడా లేదు.