Government Teachers Suspension: సాధారణంగా ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు ఏడ్చుతాయి. ఒక కుక్క చనిపోతే మిగతా కుక్కలు బాధపడతాయి. అంతలా ఉంటుంది జాతి ప్రేమ, సంఘ ప్రేమ.. కానీ అటువంటిది మనుషుల్లో కనిపించదు. మాకెందుకులే అన్నట్టు ఉంటుంది వారి వ్యవహార శైలి. తాజాగా అటువంటి ఘటనే వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండడమే వారి ఆందోళనకు కారణం. ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమించి డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను సాధిస్తే.. ఇలా ఆరోపణలు చేయడంపై వారు తల్లడిల్లుతున్నారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సిన కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం ఆందోళన కలిగిస్తోంది.
* వైసీపీకి మద్దతు..
కడప జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు డీఎస్సీ 2025 ఉపాధ్యాయులకు కాకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇటీవల డీఎస్సీ అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేసింది. ఆ ప్రతినిధి బృందంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సంగమేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వీరు కడప జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధుల బృందం డీఎస్సీ 2025 అక్రమాలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ బృందంలో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ విషయం బయటకు రావడంతో కడప జిల్లా డీఈవో స్పందించారు. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ముగ్గురు పై వేటు వేశారు. వేంపల్లి మండలం రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి. పులివెందుల మండలం అహోబిలాపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు వెంకటనాథరెడ్డి. వేంపల్లి మండలం భారతి ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు సంగమేశ్వర్ రెడ్డి. అయితే ఇందులో సంగమేశ్వర్ రెడ్డి ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మిగతా ఇద్దరు మాత్రం వైసీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నాయకులుగా ఉన్నారు. మరోవైపు ఇదే కారణాలతో అనంతపురం జిల్లా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ రెడ్డి సైతం సస్పెండ్ అయ్యారు.
* ఉపాధ్యాయ సంఘాల ముసుగులో..
రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఆందోళనతో ఉంటే.. కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలా చేయడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల ముసుగులో రాజకీయాలు చేస్తుండడం పై చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయ జాతి పై జరుగుతున్న ఉద్దేశపూర్వక ఎదురుదాడిని అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు మద్దతు తెలపడం పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే ఆ రెండు జిల్లాలు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల ముసుగులో చాలామంది వ్యవహరిస్తున్నారని.. వారంతా వైసీపీతో అంటగాకుతున్నారని చర్చ జరుగుతుండడం.. అటువంటి వారిని సంఘాలకు దూరం పెట్టాలన్న డిమాండ్ పెరుగుతుండడం విశేషం.
View this post on Instagram