Salary Scam: కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులు చాలా మంది వర్క్ఫ్రం హోం చేశారు. ఇదే సమయంలో మరో కంపెనీతో టైఅప్ అయి ఉద్యోగాలు చేశారు. రెండు రకాల వేతనాలు తీసుకున్నారు. పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు చిన్న కంపెనీలు పార్ట్టైం జాబ్స్ ఇచ్చాయి. తర్వాత ఈ మూన్లైట్ జాబ్స్ చేస్తున్నవారిని గుర్తించిన సంస్థలు చర్యలు తీసుకున్నాయి. ఈ రోజుల్లో డబ్బే అన్నింటికి మూలం కావడంతో చాలా మంది ఇలా డబుల్ జాబ్స్ చేస్తున్నారు. డబుల్ జీతీం తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లోనూ డబుల్ జాబ్స్ బయటపడ్డాయి. తెలంగాణ సచివాలయం కేంద్రంగా ఈ వ్యవహారం సాగడం సంచలనంగా మారింది. ఉద్యోగాల కోసం అనేక మంది యువత నిరాశతో సమయం వెచ్చిస్తున్న సమయంలో, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రెండు శాఖల్లో ఏకకాలంలో పనిచేసి డబుల్ జీతాలు పొందుతున్నారు. ఈ వ్యవహారం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆడిట్ నివేదికలో దాదాపు 40 మంది రెగ్యులర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా వ్యవహరిస్తున్నట్లు తేలడం వ్యక్తిగత అత్యాశ మాత్రమే కాదు.. పాలనా వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తి చూపుతోంది.
ఆడిట్లో బయటపడిన నిజాలు
ఒకే ఆధార్ కార్డుతో రెండు వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి జీతాలు డ్రా చేసుకుంటున్నట్లు తెలియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు శాఖల్లో ఏకకాలంలో పని చేస్తూ జీతాలు పొందడం సాధారణ పరిస్థితి కాదు. ఇలాంటి కేసులు చాలా కాలంగా కొనసాగుతూ ఉండి కూడా సకాలంలో గుర్తించబడకపోవడం వ్యవస్థలోని పర్యవేక్షణ లోపాలను సూచిస్తోంది. సాంకేతికంగా ఆధార్, బ్యాంక్ ఖాతాలు, ఉద్యోగుల డేటాబేస్లను అనుసంధానం చేసి తనిఖీలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది.
నిరుద్యోగుల ఆగ్రహం..
నిరుద్యోగం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి రెండింతలు జీతాలు తీసుకోవడం అంటే పన్ను చెల్లించే సామాన్యుల డబ్బును దుర్వినియోగం చేయడమే. ఉద్యోగాలు లేక ఎందరో యువత కష్టపడుతుండగా, కొందరు అక్రమంగా లాభం పొందడం సామాజిక అసమానతను మరింత పెంచుతుంది. ఇది ప్రభుత్వపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
అధికారులు ఏం చేస్తున్నట్లు?
ఇన్ని రోజులు ఇలాంటి అక్రమాలు గుర్తుకు రాకపోవడం నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగుల నియామకం, హాజరు, జీతాల చెల్లింపు వ్యవస్థలో పరస్పర తనిఖీలు సరిగా పనిచేయకపోతే ఇలాంటి లొసుగులు ఏర్పడతాయి. ఆడిట్ తర్వాతనే వెలుగులోకి రావడం అంటే సాధారణ పర్యవేక్షణలో లోపం ఉందని స్పష్టం. బాధ్యత వహించాల్సిన అధికారులపై కూడా విచారణ జరగాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కఠిన చర్యలే పరిష్కారం..
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అవసరం. ఆధార్ ఆధారిత రియల్టైమ్ వెరిఫికేషన్, వివిధ శాఖల మధ్య డేటా షేరింగ్, క్రమం తప్పకుండా ఆడిట్లు, డిజిటల్ హాజరు వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. తప్పు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, లోపాలు గుర్తించని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. పారదర్శకత, సాంకేతిక పర్యవేక్షణ పెరిగితేనే ప్రజా ధనం సురక్షితంగా ఉంటుంది.
ఇది కేవలం కొందరు ఉద్యోగుల అత్యాశ విషయం మాత్రమే కాదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తోందనే ప్రశ్నను లేవనెత్తుతోంది. నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకుంటేనే ప్రజల్లో అపనమ్మకం మరింత పెరుగుతుంది. ఇలాంటి అక్రమాలపై తక్షణ, కఠిన చర్యలు తీసుకోవడం అవసరం.