Ajit Agarkar: టీమిండియా లో సమూల మార్పులు తీసుకొస్తోంది బీసీసీఐ. ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక విషయంలో బోర్డు పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు టోర్నీలను దృష్టిలో పెట్టుకొని టెస్ట్, వన్డే, టి20 జట్లకు సమర్ధులైన ప్లేయర్లను సిద్ధం చేస్తున్నారు. అందువల్లే నిబంధనలను కఠిన తరం చేశారు. ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు.. అద్భుతమైన సౌలభ్యాలు కల్పిస్తూనే.. మిగతా విషయాల్లో బోర్డు పెద్దలు అత్యంత కఠినంగా ఉంటున్నారు. సెలక్షన్ కమిటీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్లేయర్ల ఎంపికను చేపడుతోంది.
టీమిండియా సాధించే విజయాలలో సెలక్షన్ కమిటీదే కీలక పాత్ర. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఆటగాళ్లు సమర్థులుగా ఉంటే జట్టుకు తిరుగు ఉండదు. కొంతకాలం టీం ఇండియా టెస్ట్ ఫార్మాట్ మినహా.. మిగతా అన్నింటిలో అదరగొడుతుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అయితే తిరుగులేని స్థాయిలో ఆడుతోంది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. టీమిండియాలో ఆ స్థాయిలో ప్లేయర్లను ఎంపిక చేసిన ఘనత ముమ్మాటికి అజిత్ కు దక్కుతుంది. ఎందుకంటే అతడు భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం అజిత్ పదవి కాలం ముగింపు దశకు చేరుకుంది. అయితే అతని పదవి కాలాన్ని పొడిగిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు ఇంతవరకు క్లారిటీ లభించలేదు. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులకు దీనిపై ఇప్పటికి స్పష్టత వచ్చింది. 2027 వరకు అజిత్ పదవి కాలాన్ని పొడగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 2023 లో అజిత్ చీఫ్ సెలెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత భారత 2024, 2026లో టి20 వరల్డ్ కప్ సాధించింది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇన్ని అనుకూలతలు మాత్రమే కాదు.. అదే స్థాయిలో అజిత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా రోహిత్, విరాట్, అశ్విన్ ను టెస్ట్ ల నుంచి తప్పుకునేలా చేసింది అజిత్ అని విమర్శలు ఉన్నాయి. దీనిపై ఏనాడూ కూడా అజిత్ నోరు విప్పలేదు. అలాగని టెస్ట్ ల నుంచి బయటికి వెళ్లిపోయిన ప్లేయర్లు ఏనాడు కూడా అజిత్ మీద విమర్శలు చేయలేదు. ఇవన్నీ కూడా మీడియా సృష్టించిన చవక బారు వార్తలని కొట్టి పారేసిన వారు కూడా ఉన్నారు.
అజిత్ ఇటీవల బోర్డు పెద్దలతో భేటీ అయ్యారని.. పదవి కాలాన్ని 2027 వరల్డ్ కప్ వరకు పొడిగించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అజిత్ పదవి కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ విషయంలో కూడా మేనేజ్మెంట్ ఇలానే వ్యవహరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గౌతమ్ గంభీర్ విషయంలో మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందిస్తుందా.. లేదా అనేది.. త్వరలో తేలుతుంది.