Ajit Agarkar : భారత మాజీ ఆల్రౌండర్ అజిత్ అగార్కర్ టీమిండియా పురుషుల జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా నియమితులయ్యారు. బీసీసీఐకి చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆయన్ను ఏకగ్రీవంగా చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసింది. ఇటీవల టీమిండియా వరుస వైఫల్యాలతో ఆగ్రహించిన బీసీసీఐ.. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మను తొలగించింది. ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. శివ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రొతో బెనర్జీ మరియు ఎస్ శరత్లతో సహా ఐదుగురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్తో కూడిన జట్టులో అగార్కర్ ఇప్పుడు భాగం అవుతాడు.
191 వన్డేలు , 26 టెస్టుల అనుభవజ్ఞుడైన అగార్కర్, సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా మరియు జతిన్ పరాంజపేతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియామకం చేసింది. తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన కెరీర్లో 349 అంతర్జాతీయ వికెట్లు తీసిన అగార్కర్ ఆల్ రౌండర్ గానూ రాణించాడు. 2017 నుండి 2019 వరకు, అగార్కర్ ముంబై సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. కోచ్ రికీ పాంటింగ్ మరియు క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్లో భాగంగా ఉన్నారు.
అగార్కర్ సారథ్యంలోనే వెస్టిండీస్తో జరిగే ఐదు టీ20Iలకు భారత జట్టును ప్రకటించనున్నారు. అతని మొదటి సెలక్షన్ ఇదే కానుంది. వన్డేలు మరియు టెస్ట్ల కోసం లైనప్లు గత నెలలో ప్రకటించబడ్డాయి, అయితే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీ20 సెటప్తో అగార్కర్ సెలక్షన్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా ఆధ్వర్యంలో అగార్కర్ సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్ , అమెరికాలలో జరిగే T20 ప్రపంచ కప్లో భారత్ జట్టును ప్రకటించనుంది. ఈ సెలక్షన్ పైనే అగార్కర్ శక్తి సామర్థ్యాలు బయటపడనున్నాయి.
అగార్కర్ కు టీమిండియాలో విశేష అనుభవం ఉంది. దాదాపు 350 వికెట్లు తీశాడు. అగార్కర్ 1997 , 2007 మధ్య భారత జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. అతను వన్డేలలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారతీయుడిగా రికార్డును కలిగి ఉన్నాడు. 2000లో జింబాబ్వేపై సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా మిగిలిపోయాడు.
బంతితో, అగార్కర్ రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో 42 మ్యాచ్ లు ఆడి 29 వికెట్లు తీశాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్ గా చేస్తున్నాడు. వన్డేల్లో అతిత్వరగా 50 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్ గా అగార్కర్ పేరిట రికార్డ్ ఇంకా ఉంది.