Team India: మొన్నటికి మొన్న ఐర్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో టీమిండియా ఓటమిపాలైంది. రెండు మ్యాచ్ లలో పరాజయం చవిచూసింది. తద్వారా అపకీర్తిని మూట కట్టుకుంది. ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత.. టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించింది. ఇంగ్లాండ్లో కూడా టి20 సిరీస్ కోల్పోయింది. ఏకంగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది.. ఐర్లాండ్ జట్టు మీద రెండు.. ఇంగ్లాండ్ జట్టు మీద నాలుగు.. మొత్తంగా ఆరు మ్యాచులు ఓడిపోయింది.. అది కూడా వరుసగా..
సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టిన తర్వాత.. శ్రేయస్ అయ్యర్ ను సారధిగా చేసిన తర్వాత టీమిండియా ఇలా రెండు సిరీస్ లు కోల్పోవడం సగటు అభిమానికి బాధ కలిగించింది. కేవలం ఈ రెండు టీ20 సిరీస్ లు మాత్రమే కాదు.. ఇంగ్లాండ్ జట్టు మీద వన్డే సిరీస్ కూడా టీమిండియా కోల్పోయింది. అటు వన్డేలలో.. ఇటు టి20 లలో మొదటి స్థానాన్ని కోల్పోయింది. దాదాపు వేయికి పైగా రోజుల తర్వాత నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీం ఇండియా.. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లు కోల్పోయి.. రెండవ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్ల ఆట తీరు మీద దారుణంగా విమర్శలు వచ్చాయి.
విమర్శల తాకిడి పెరిగిపోవడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు మొత్తానికి మళ్లీ గాడీలో పడ్డారు. జింబాబ్వే మీద మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను వైట్ వాష్ చేసుకున్నారు. తద్వారా పోగొట్టుకున్న నెంబర్ వన్ స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. ఇక వన్డేలలో కూడా టీమిండియా మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది. ఇది ఒకరకంగా అభిమానులకు శుభవార్త. 2027 వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా నెంబర్ వన్ స్థానంలోకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. కేవలం ఇది మాత్రమే కాకుండా.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన పరంగా చూస్తే.. వన్డేలలో నెంబర్ వన్ బ్యాటర్ గా గిల్ కొనసాగుతున్నాడు. టి20 లలో ఇషాన్ కిషన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ వన్డే బ్యాటర్ల విభాగంలో నాలుగు స్థానంలో ఉన్నాడు. టెస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా వైట్ బాల్ ఫార్మాట్లో కొత్తగా నిరూపించుకోవడానికి లేదు. కానీ రెడ్ బాల్ ఫార్మాట్ లో సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. త్వరలో జరిగే శ్రీలంక సిరీస్ లో టీమిండియా ప్లేయర్లు అదరగొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. గతంలో రెండు పర్యాయాలు టీమిండియా ఫైనల్ వెళ్లినప్పటికీ.. టెస్ట్ గదను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి మాత్రం టీమిండియా ఎట్టి పరిస్థితిలో ఆ అవకాశాన్ని వదులుకోకూడదని అభిమానులు కోరుతున్నారు.