HomeNewsప్రమాదం అంచున మహానగరాలు

ప్రమాదం అంచున మహానగరాలు


దేశంలోని మహానగరాలు అన్ని దాదాపు ప్రమాదం అంచుకు చేరుకొంటున్నాయి. కరోనా వైరస్ ఉదృతి ఎక్కువగా మహానగరాలకు పరిమితం అవుతున్నది. కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా వర్గీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతో సహా ముంబయి, కొల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నరు మెట్రో నగరాలన్నీ రెడ్‌ జోన్‌లోనే నిలవడటం గమనార్హం.

పైగా, ఈ మహానగరాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం విడుదల చేసిన 170 హాట్‌స్పాట్‌ల జాబితాలో 123 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అత్యంత విస్తృతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఇలా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న జిల్లాల్లో దేశ రాజధాని నగరంలోని తొమ్మిది జిల్లాలూ ఉన్నాయి.

కరోనా మహమ్మారి భారినపడి దేశంలో 420 మంది ప్రాణాలు కోల్పోయారని గురువారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పాజిటివ్‌ బాధితుల సంఖ్య 12,759కి చేరింది. మొత్తం బాధితుల్లో 1515 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 10,824 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 76 మంది విదేశీయులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో కలవరపెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిలో గురువారం ఒక్క రోజే 107 కొత్త కేసులు నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. దీంతో పాజిటివ్‌ కేసులు 2043కు, మరణాలు 116కు పెరిగాయి.

మహారాష్ట్రలో గురువారం నాటికి కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 187కు చేరింది. మొత్తం 3,081 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్ర తర్వాత కరోనా విజృంభనలో రెండో స్థానంలో ఉన్న రాజధాని నగరం న్యూఢిల్లీలో కేసుల సంఖ్య గురువారం నాటికి 1578కు చేరింది.

పశ్చిమ బెంగాల్‌లోనూ ఈ వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనేవుంది. గురువారం 18 కొత్త కేసులు నమోదు కాగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 231కి చేరింది. ఇప్పటి వరకూ ఏడుగురు చనిపోయారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 29 కేసులు కొల్‌కతాలోనే నమోదు కావడం విశేషం.

చెన్నైలో కరోనా కేసుల సంఖ్య గురువారం నాటికి 214కు చేరింది. నగరంలోని రాయపురం జోన్‌లో ఈ వైరస్‌ విజృంభన తీవ్రస్థాయిలో ఉంటోంది. నార్త్‌ చెన్నైలో ఉన్న ఈ జోన్‌లో ఇప్పటి వరకూ 64 కేసులు పాజిటివ్‌గా తేలాయి. కోడంబక్కమ్‌, అన్నా నగర్‌, తొండియార్‌ పేట జోన్లలో 20కి పైబడి కరోనా కేసులు నమోదయ్యాయి.

బెంగళూరులో కరోనా కారణంగా గురువారం మరొకరు చనిపోయారు. రామస్వామి పాళ్యకు చెందిన 69 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకటంతో ఈ నెల 10న విక్టోరియా ఆసుపత్రిలో చేరిన ఆయన గురువారం మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య ఆ రాష్ట్రంలో 13కు చేరింది. గురువారం బెంగళూరులో 9 కేసులు సహా రాష్ట్రం మొత్తం మీద 34 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 313కు చేరింది.

యుపిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 773కు పెరగ్గా, మృతుల సంఖ్య 13గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని సూరత్‌లో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో అధికారులు ఈ నెల 22 వరకూ కర్ఫ్యూ విధించారు. నగరంలోని నాలుగు స్టేషన్ల పరిధిలో ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

కాగా, ఈనెల 20వ తేదీ నాటికి గోవా గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ భరోసా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రణాళికలు ప్రకారం అన్నీ జరిగితే గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించిన మొదటి రాష్ట్రంలో గోవా నిలుస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా రోగుల మరణాల రేటు 3.3 శాతంగా ఉందని, చికిత్స అనంతరం కోలుకున్న వారి శాతం 12.02 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. మేకిన్‌ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపైనా, లాక్‌డౌన్‌ సమయంలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular