India cuts Pakistan Ravi River water: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై 2025 ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను ముష్కరులు కాల్చి చంపారు. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ, ఆర్మీ, పోలీసులు.. ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన వారుగా గుర్తించారు. దీంతో ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అంతేకాకుండా దౌత్యపరంగా చాలా అంశాల్లో దాయాది దేశానికి షాక్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా సిందూ జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది. తాజాగా రావి నది నీటిని కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. షాపూర్ కండి బ్యారేజ్ పనులు మార్చి 31 నాటికి పూర్తి కానున్నాయి. దీంతో ఏప్రిల్ నుంచి రావి నది మిగులు నీళ్లు పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపనున్నట్లు జమ్మూ కాశ్మీర్ మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు.
సిందూ జల ఒప్పందంలో భాగమే…
1960 ఒప్పందం ప్రకారం రావి, సట్లెజ్, బీయాస్ నదులు భారత్ నియంత్రణలో ఉన్నాయి. ఇన్నాళ్లూ స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడంతో 40–50 శాతం నీళ్లు వృథా పాక్కు వెళ్లాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో భారత్ తన హక్కులను పూర్తి వాడుకుంటుందని చూపిస్తుంది.
పాకిస్తాన్ వ్యవసాయంపై ప్రభావం
రావి నది నీళ్లు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో 1.5–2 లక్షల ఎకరాలకు సాగునీటిగా ఉపయోగపడతాయి. వేసవి వేళ ఈ కొరత పశ్చిమ పంజాబ్లో ధాన్య, పత్తి పంటలను ప్రభావితం చేస్తుంది. ఇది ఆహార ఉత్పత్తి, ఆర్థికంగా ఒత్తిడి పెంచుతుంది.
భారతకు ప్రయోజనాలు…
రావి నదిపై నిర్మించిన ప్రాజెక్టుతో జమ్మూ కశ్మీర్లో 32,000 హెక్టార్లు (సాంబా, కతువా), పంజాబ్లో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఏటా 940 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. వృథాగా వెళ్లే 1,000 క్యూసెక్కుల నీటిని సద్వినియోగం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కోసం భారత్ రూ.3,166 కోట్లు ఖర్చు చేసింది. 2018లో నిర్మాణం ప్రారంభమైంది.
ఇండస్ ట్రీటీ పాక్కు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్ స్వీయ సదుపాయాలు లేకపోవడంతో నష్టపోయింది. షాపూర్ కండి పూర్తయితే భారత్ హక్కులను పూర్తి అమలు చేస్తుంది. పాక్ ప్రతిస్పందనలు, అంతర్జాతీయ చర్చలు రావచ్చు కానీ చట్టపరంగా భారత్ సరైనదే.