Indus Waters Treaty: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. దశాబ్దాల నాటి సిందూ జల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది. తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. రక్తం నీరు ఏకకాలంలో పారవని స్పష్టం చేసింది. దీంతో సింధూ జలాలు రాక పాకిస్తాన్లో కరువు చాయలు, ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఒప్పందం పునరుద్ధరణకు పాకిస్తాన్ అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు.
చుక్క నీరివ్వం..
తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ సింధు జలాల విషయంలో భారత్ కఠిన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సింధు నదీ వ్యవస్థ నుంచి పాకిస్థాన్కు ఒక్క చుక్క నీరు కూడా చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ‘సింధు జలాల ఒప్పందం రద్దు చేయలేదు. ఇంకా అమలులోనే ఉంది. కానీ తాత్కాలికంగా నిలిపివేశాం. సరిహద్దు గుండా నీళ్లు వెళ్లకుండా ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని సీఆర్.పాటిల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హోం మంత్రి అమిత్ షా ఈ అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.
ఒప్పందం స్థితి ఏమిటి?
1960 సింధు జలాల ఒప్పందం ప్రస్తుతం హోల్డ్లో ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయకపోయినా, పాకిస్తాన్కు నీరు అందకుండా చేసేందుకు సాంకేతిక, ఇంజనీరింగ్ చర్యలు తీసుకోవడం ద్వారా ఒప్పంద స్ఫూర్తిని కార్యరూపంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో భారత్ సింధు జలాలను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. నీటిని భారత్ సొంత అవసరాల కోసం వినియోగించుకోవాలి అన్న ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలను అమలుకు చర్యలు చేపట్టారు.
ఆ రాష్ట్రాలకు అదనపు నీరు..
సింధూ జలాలను కేంద్రం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు మళ్లించాలని భావిస్తోంది. దీంతో ఆ రాష్ట్రాలకు అదనపు నీటి వనరులు లభించే అవకాశం ఉంది. శత్రు దేశానికి నీటిని వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా ఇప్పటికే సింధూ, దాని ఉప నదులపై బ్యారేజీలు నిర్మిస్తోంది. అధిక వర్షాలు ఉంటే గేట్లు ఎత్తి పాకిస్తాన్లో ఆకస్మిక వరదలు సృష్టిస్తోంది.
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి వివాదంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఒప్పందం నిలిపివేతను ఆచరణాత్మకంగా అమలు చేయడం ద్వారా భారత్ తన నీటి సార్వభౌమత్వాన్ని బలపరచుకోవాలని చూస్తోంది. ఈ అంశం రాబోయే రోజుల్లో ద్విపాక్షిక సంబంధాలపై ఎంత ప్రభావం చూపించనుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

