India Pakistan Water Dispute: 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ దాడిని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నిర్వహించారని భారత్ ఆరోపించి, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని అమలు నిలిపివేసింది. దీంతో రెండు దేశాల మధ్య నీటి వనరుల వివాదం తీవ్ర రాజకీయ రూపం తీసుకుంది. ఇరు పక్షాలు తమ తమ వాదనలను బలంగా వ్యక్తం చేస్తున్నాయి.
ఒప్పందం ఇదీ..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదులను రెండు దేశాల మధ్య విభజించారు. తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్పై భారత్కు పూర్తి నియంత్రణ ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లో ఎక్కువ భాగం పాకిస్తాన్కు కేటాయించారు. దశాబ్దాలుగా ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాని అమలు ప్రశ్నార్థకంగా మారింది.
హోల్డ్లో పెట్టిన భారత్..
పహల్గామ్ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఒప్పందం అమలు నిలిపివేయబడుతుందని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదని భారత్ వాదిస్తోంది. గత ఆరు దశాబ్దాల్లో వాస్తవ పరిస్థితులు పూర్తిగా మారాయి కాబట్టి, ఒప్పందాన్ని ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా పునఃపరిశీలించాలని అభిప్రాయపడుతోంది.
భౌభౌ అంటున్న పాకిస్తాన్..
పాకిస్తాన్ భారత్ చర్యను ఏకపక్షంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడమని ఆరోపిస్తోంది. ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగా అమలులో ఉందని, ఏ దేశం ఒంటరిగా దాన్ని రద్దు చేయలేదు లేదా నిలిపివేయలేదని వాదిస్తోంది. పాకిస్తాన్కు రావాల్సిన నీటిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. నీటి భద్రతను జాతీయ భద్రతలో భాగంగా చూస్తున్నామని, దానికి ముప్పు ఏర్పడితే ఏ చర్యకైనా వెనుకాడబోమని రక్షణ శాఖ అధికారులు కూడా పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ నిపుణులతో సదస్సు నిర్వహించి తమ వాదనను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తోంది.
ఉగ్రవాదమే అసలు సమస్య..
భారత్ ఉగ్రవాదం ఆపకుండా సహకారం కొనసాగదని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఒప్పందం అంతర్జాతీయ చట్టం ప్రకారం శాశ్వతమని, నీటి హక్కులు ఎవరూ హరించలేరని బలంగా వ్యక్తం చేస్తోంది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ పునరుద్ఘాటిస్తుండగా, పాకిస్తాన్ ఈ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపై తీసుకెళ్లి తన స్థానాన్ని బలపరచుకోవాలని చూస్తోంది. ఈ వివాదం కేవలం నీటి వనరులకు మాత్రమే పరిమితం కాదు. ఉగ్రవాదం, దౌత్య సంబంధాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. గతంలో ఒప్పందం యుద్ధాలను కూడా అధిగమించింది. కానీ ఇప్పుడు దాన్ని ఉగ్రవాదం ఆపడానికి లివర్గా ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. నీటి వివాదం ఆర్థికంగా, వ్యవసాయంగా రెండు దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఒప్పందం పూర్తిగా రద్దు అయినా లేదా సవరణలు జరిగినా, దాని పరిణామాలు దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, నీటి వనరుల సమస్యలు ఎల్లప్పుడూ దౌత్యబద్ధంగా పరిష్కరించడం ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుంది.
