Snapchat Scam : సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా స్నాప్ చాట్ ద్వారా పరిచయమయ్యాడు.. ఆ తర్వాత స్నేహం చేశాడు.. కొన్ని రోజుల తర్వాత తాను ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతున్నట్లు నమ్మించాడు.. అయితే అవి ప్రస్తుతం నష్టాల్లో ఉందని.. డబ్బు కావాలని అడిగాడు.. అతని అమాయకత్వాన్ని చూసి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకొని మరీ అతడికి సహాయం చేసింది.. అయినా అతడికి డబ్బు ఆశ చావలేదు.. మరింత కావాలని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.. దీంతో చేసేదేమీ లేక ఆ యువతీ తన ఇంట్లోని బంగారం అమ్మి మరీ డబ్బు అందించింది.. కానీ మరోసారి ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?
నేటి కాలంలో డబ్బు కోసం ఎలాంటి ఆకృత్యాలకు అయినా పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మద్దిశెట్టి గౌతం నాయుడు అనే యువకుడు విజయవాడ సూర్యాపేటకు చెందిన యువతికి పరిచయమయ్యాడు. అయితే ఈమె ప్రస్తుతం హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకున్న వీరిద్దరూ ఆ తర్వాత నేరుగా కలుసుకున్నారు. ఒకసారి కోయంబత్తూర్ లో కూడా పర్యటించారు. ఈ క్రమంలో గౌతం నాయుడు రూ. 50 లక్షలు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టినట్లు.. దీంతో అవి ప్రస్తుతం బ్లాక్ అయ్యాయని తెలిపాడు.
ఇది నమ్మిన ఆ యువతీ లోన్ యాప్ ద్వారా రూ. 10 లక్షల లోన్ తీసుకొని అతడికి అందించింది. అయితే మరింత డబ్బు కావాలని ఆ యువతని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ క్రమంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంటున్నట్లు ఫోటో తీసి ఆమెకు అందించాడు. దీంతో చేసేది ఏమీ లేక ఆ యువతీ ఇంట్లో ఉన్న బంగారంను తల్లిదండ్రులకు చెప్పకుండా తనఖా పెట్టి రూ.1.27 కోట్లను అందించింది.. అయినా కూడా ఇంకా డబ్బు కావాలని వేధించడంతో.. చివరికి ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నా కూడా చాలామందికి అవగాహన ఉండడం లేదని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయం అయిన వారిని పూర్తిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పరిచయం లేని వ్యక్తులకు ఎలాంటి ఆధారం లేకుండా డబ్బులు ఇవ్వరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.