Homeఅత్యంత ప్రజాదరణనాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా?

నాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ సహచరుడు ఒగ్గేసి పోయాడు. కేసీఆర్ ను వదిలి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మాయదారి కరోనా ఆయన ప్రాణాలు తీసింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనాను జయించినా.. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్ ల బారినపడి అవయవాలు దెబ్బతిని తెలంగాణ తొలి హోంమంత్రి , ఉద్యమకారుడు నాయిని నర్సింహారెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు.

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కేటీఆర్‌‌ టార్గెట్?

తెలంగాణ కోసం  కేసీఆర్ ఒంటరిగా బయలు దేరినప్పుడు ఆయన వెన్నంటి ఉండి నడిచిన వ్యక్తుల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. అందుకే ఆయన తిట్టినా.. విమర్శించినా కూడా కేసీఆర్ ప్రేమగానే చూసేవాడు. మొన్నటికి మొన్న టికెట్ ఇవ్వకుంటే నాయిని తిట్టినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కౌంటర్లు ఇప్పించలేదు. సర్దిచెప్పారు. నాయిని చావుబతుకుల్లో ఉంటే తాజాగా పరామర్శించాడు కూడా.

నాయిని నర్సింహా రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ. హైదరాబాద్‌లో ఓ సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన అరెస్టు అయ్యారు. 19 నెలల పాటు జైలుజీవితాన్ని గడిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నాయిని నర్సింహారెడ్డి సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండేవాడు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టీ అంజయ్యను ఓడించిన ఘనత నాయిని సొంతం. ముషీరాబాద్ నియోజకవర్గం నాయినికి కంచుకోట. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని.. అంజయ్యను ఓడించారు. అదే పార్టీ అభ్యర్థిగా మళ్లీ.. 1985లో పోటీ చేసి గెలిచారు. 1969 నుంచీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలను సాగించారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ వెంట నడించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.

అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్-టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్‌లో మంత్రిగా కూడా నాయిని పనిచేశారు. అనంతరం 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ముషీరాబాద్ నుంచి గెలుపొందారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నాయిని నడిచాడు. అండగా నిలబడ్డాడు. కేసీఆర్ పై ఈగ వాలనిచ్చేవాడు కాదు నాయిని నర్సింహారెడ్డి. ఎవరైనా కేసీఆర్ ను తిడితే వార్నింగ్ ఇచ్చేవాడు. అందుకే కేసీఆర్ కూడా నాయిని అన్నా అని ముద్దుగా పిలిచేవాడు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి తెలంగాణ కేబినెట్ లో ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే కేసీఆర్ ఈ నాయినికి పెద్ద పీట వేశారు. ఏకంగా తన తర్వాత కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా కేసీఆర్ తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఉద్యమ సహచరుడికి నంబర్ 2 స్థానాన్ని కట్టబెట్టాడు. తనతోపాటు ఆది నుంచి నడించిన నాయినికి గౌరవిమిచ్చాడు. ఐదేళ్ల పాటు తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డికి అందలం దక్కింది. కేసీఆర్ నమ్మినబంటుగా అప్పుడు నాయిని వ్యవహరించారు.

Also Read: కేసీఆర్‌‌ అంటే పవన్‌కు అందుకే భయమా?

అయితే కరోనా కాలంలో నాయిని ఎంతో జాగ్రత్తలే పాటించారు. బయటకు రాలేదు కూడా. కానీ కార్యకర్తల బలవంతం మీద ఓ కార్యక్రమంలో పాల్గొని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో నాయిని పాల్గొన్నట్టు తెలిసింది. అక్కడే అభిమానులతో కాసేపు గడిపారట.. అక్కడే కరోనాకు గురయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో మరోసారి నాయిని అస్వస్థతకు గురి అయ్యారు. తర్వాత కరోనాను జయించినా న్యూమోనియా సోకి ఉపిరితిత్తులు దెబ్బతిని తుదిశ్వాస విడిచాడు.

కరోనా ధాటికి మరో తెలంగాణ ఉద్యమ దిగ్గజం నేలరాలింది. కేసీఆర్ సైతం నాయినిని చివరి సారి చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. నిన్న ఆస్పత్రికి వచ్చి మరీ నాయిని చూశారు. నిన్న రాత్రే నాయిని కన్నుమూశారు. ఆ ఉద్యమకారుడికి మనం కూడా సలాం చేద్దాం.

-నరేశ్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular