ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని అర్థమవుతోంది. మొన్నటివరకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారు. మార్చి నెలలో నిర్వహించాల్సిన ఎన్నికలు పెండింగ్లో పడ్డాయి. ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం పడుతుండడంతో రాష్ట్రంలో కార్యకలాపాలు కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు హైకోర్టులో అదనపు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. కరోనా తగ్గడంతో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన హైకోర్టుకు తెలిపారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా మరోసారి వాయిదా వేయించాలని వైసీపీ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నా కమిషనర్ నిర్ణయంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతోంది. ఏపీలో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో ఎలాగైనా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పట్లో సిద్ధమైంది. ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ విషయంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయాలూ లేవు. ప్రభుత్వం కోరుకున్న విధంగానే ఆయన స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. నోటిఫికేషన్ జారీ చేశారు. పోలింగ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం తమ అధికార బలంతో పలుచోట్ల ఏకగ్రీవాలు చేయించింది.
Also Read: సమస్యల సుడిగుండంలో జగన్ సర్కార్
అయితే.. వీటిని అడ్డుకునేందుకు నిమ్మగడ్డకు ప్రభుత్వంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మద్దతు తీసుకోవడంతో తేడా కొట్టింది. అధికార పార్టీ ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న సమయంలో దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిమ్మగడ్డకు చుక్కెదురైంది. ఆ తర్వాత కరోనా ప్రభావం మొదలుకావడంతో నిమ్మగడ్డ ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వానికి షాకిస్తూ ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా పేరుతో తమకు అనుకూలంగా సాగిపోతున్న స్థానిక సంస్ధల ఎన్నికలను నిమ్మగడ్డ అర్ధంతరంగా వాయిదా వేయడంతో ఆగ్రహంతో సీఎం జగన్.. ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను తొలగించారు.
ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ను నియమించారు. చివరికి న్యాయస్థానాలు కనగరాజ్ను తొలగించి తిరిగి నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పజెప్పాయి. దీంతో నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలకు వెళ్లొద్దని ప్రభుత్వం పట్టుబట్టింది. మరోవైపు నవంబర్, డిసెంబర్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రులు చెబుతున్నారు. అయినా మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిసి రావడంతో నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు.
Also Read: చంద్రబాబుకు సీన్ రివర్స్ అవుతోంది..!
ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు హైకోర్టు అనుకూలంగా ఆదేశాలు ఇస్తే తప్పకుండా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ పేరుతో ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నెరవెరేలా కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం కరోనా తగ్గిందని స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును కోరినా ఫలితం ఉంటుందా అనేది కూడా ప్రశ్నగానే మారింది.