
ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకే కాదు.. ఏకంగా జడ్జీలకు కూడా న్యాయం జాప్యం జరుగుతూనే ఉంది. రాష్ట్ర సీఐడీ అయితేనేమీ.. కేంద్రంలోని సీబీఐ అయితేనే హైకోర్టు జడ్జీల కేసులకు సైతం అదే జాప్యం.. అదే నిర్లక్ష్యం పట్టడం నిజంగా విడ్డూరమే మరి.. ఏపీ హైకోర్టు జడ్జిలను దూషించిన వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా నెటిజన్లపై అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయి. ఇది పెద్ద దుమారం రేపింది. అయితే. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వంలోని సీఐడీ సారథ్యంలో ఈ కేసులు కావాలనే జాప్యం జరిగిందన్న విమర్శలు వచ్చాయి.. దీంతో ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యి కేసును సీబీఐకి అప్పగించింది.
సీఐడీ నమోదు చేసుకున్న కేసులను మాత్రమే స్వాధీనం చేసుకున్న సీబీఐ.. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని.. కనీసం నాలుగు నెలలు పడుతుందని తాజాగా కోర్టుకు తెలిపింది. సీబీఐకి ఇచ్చిన గడువు తాజాగా పూర్తయ్యింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగగా.. సీబీఐ నివేదికను హైకోర్టులో సమర్పించింది. సీబీఐ కూడా జడ్జిలపై దూషణల కేసులో పెద్దగా దర్యాప్తు చేయడం లేదని తెలిసింది.
జడ్జీలను దూషించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితులు వివిధ దేశాల్లో ఉన్నందున వారిని విచారించేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపింది. అంతవరకు సమయం ఇవ్వాలని సీబీఐ న్యాయవాది కోరారు. దీంతో న్యాయమూర్తి సీబీఐకి గడువు ఇస్తూ విచారణను ఏకంగా వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా వేశారు.
ఏపీ హైకోర్టు జడ్జీలను బెదిరిస్తూ ఓ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావాలనే పెట్టారని దీని వెనుకు కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణలో ఫేక్ అకౌంట్ల నుంచి ఇవన్నీ చేశారని తేలినట్టు సమాచారం.