YSRCP plenary : తెలుగుదేశం పార్టీ మహానాడు ను పరమ పవిత్రంగా భావిస్తుంది. పార్టీకి ఒక ఆయుధంలా మార్చుకుంటూ ఏటా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహణ ఉంటుంది. ఎన్నికలు, విపత్తులు వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పండుగ నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే తెలుగుదేశం మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సంప్రదాయాన్ని పెట్టుకుంది. ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కానీ ఏటా దానిని నిర్వహించలేక చేతులెత్తేస్తోంది. ఈ ఏడాది కూడా ప్లీనరీ అనేది కానరావడం లేదు. అటువంటి సన్నాహాలేవీ ప్రారంభం కాలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన తప్పడం లేదు. పార్టీ క్యాడర్ను కలిసేందుకు ఇదో అరుదైన అవకాశం అని జగన్ భావించడం లేదు.
* అధికారానికి దూరమై రెండేళ్లు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి రెండేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుసుకునే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. జిల్లాల పర్యటన అని గత ఏడాది సంక్రాంతికి ముందు ప్రకటించారు. రెండు సంక్రాంతులు దాటి వెళ్లిపోయాయే తప్ప.. ఇంతవరకు జగన్ పార్టీ శ్రేణులను పలకరించిన పాపాన పోలేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారం రోజులపాటు పర్యటన చేసి.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ క్రియాశీలక కార్యకర్తను పలకరిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ఏళ్లు గడుస్తున్న కార్యరూపం ఇవ్వలేదు. పోనీ ప్లీనరీ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రప్పించి.. వారికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం లేదు.
* మూడేళ్ల కిందట..
అప్పుడెప్పుడో 2023లో ప్లీనరీ నిర్వహించారు. 2024 లో ఎన్నికల ఫలితాలు వచ్చాయని తప్పించుకున్నారు. 2025లో అటువంటి ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు 2026లో దాటవేసే ధోరణితో ఉన్నారు. 2027లో నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పాదయాత్ర మొదలు కాబోతోంది ఆ సంవత్సరంలోనే. అయితే ప్లీనరీ నిర్వహణతో పాటు జిల్లాల పర్యటన విషయంలో జరుగుతున్న జాప్యంతో.. పాదయాత్ర పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా కారణాలు చెప్పి పాదయాత్ర వాయిదా వేసిన ఆశ్చర్య పోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.
