rk kotha paluku : ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో సంపాదకీయం రాస్తుంటారు. ఇందులో వర్తమాన రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. తనదైన విశ్లేషణ చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో తనలో ఉన్న పాత్రికేయుడిని నిద్ర లేపుతుంటారు. మరికొన్ని సందర్భాలలో ఒక సామాన్య పాఠకుడి మాదిరిగా ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. వ్యవస్థను.. వ్యక్తులను తన పెన్ను రాతలతో కడిగి పారేస్తుంటారు.
తాజాగా ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కొత్త పలుకు సంపాదకీయంలో రాధాకృష్ణ జగన్ కు తలంటే కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవానికి ఇది రాధాకృష్ణకు అలవాటైన పని. ఎందుకంటే వైయస్ ఆయనకు నచ్చరు. ఆయన కుమారుడు జగన్ కూడా అస్సలు నచ్చరు. ఎందుకంటే చంద్రబాబుకు దీటైన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి రాధాకృష్ణ ఆ వైరాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇప్పటివరకు రాధాకృష్ణ జగన్ ముఖాముఖిగా విమర్శించుకున్నది లేదు. వారిద్దరికీ గట్టు పంచాయతీలు కూడా లేవు.
తాజా కొత్త పలుకులు రాధాకృష్ణ జగన్ విషయంలో మరోసారి తన ఆవేశాన్ని బయట పెట్టుకున్నారు. ఆయన దారి తప్పిన నేపథ్యంలో.. వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాధాకృష్ణ భుజాలకు ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారని.. రాజకీయాల కోసం దిగజారుతున్నారని.. విలువలను మర్చిపోయారని ఇలా తనకు అలవాటైన రీతిలో రాధాకృష్ణ రాస్కొచ్చారు. ఇదే సమయంలో మహాత్మా గాంధీ.. తమిళ ముఖ్యమంత్రి విజయ్ వరకు అందర్నీ ఉదాహరణలుగా చూపించారు.
విజయ్ ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిన నేపథ్యంలో దానిని జగన్ అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆర్కే కు తెలిసింది కావచ్చు.. అందువల్లే విజయ్ సాధించిన విజయాన్ని రాధాకృష్ణ ఉదాహరణగా చెప్పారు. అయితే విజయ్ మాదిరిగా ఉండాలని.. నరుక్కుంటూ పోతామని.. రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తే జనం ఆమోదించరని.. ఇలా చేసుకుంటూ పోతే జగన్ మరింత నష్టపోతారని సూక్తులు చెప్పారు రాధాకృష్ణ.
జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రజలే ఆయనకు ఒక దారి చూపాలని.. ఆయనకు మంచి బుద్ధులు చెప్పడానికి ఇప్పుడు తండ్రి కూడా లేరని రాధాకృష్ణ చివర్లో ఒక టచ్ ఇచ్చారు. వాస్తవానికి జగన్ అంటే రాధాకృష్ణకు అంతగా ఇష్టం ఉండదు. పైగా ఆయన వేసే ప్రతి అడుగును విమర్శిస్తూ ఉంటారు. అలాంటప్పుడు జగన్ మీద ఆర్కే కు ఎందుకింత ప్రేమ.. ఎందుకింత వాత్సల్యం కలిగిందో అర్థం కావడం లేదు. దారిలో పెట్టడానికి ఈసారి ఏకంగా ఒక పేజీకి మించిన సంపాదకీయం రాశారు.
వాస్తవానికి జగన్ అమాయకుడు కాదు. చిన్న పిల్లాడు అంతకంటే కాదు. ఆయన వెంట సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఎలాంటి రాజకీయాలు చేయాలో జగన్ కు తెలుసు. పైగా 2019లో సింగిల్ పార్టీగా పోటీ చేసి భారీగా మెజారిటీ తెచ్చుకున్నాడు. అలాంటప్పుడు రాధాకృష్ణ చేసిన నీతి హితబోధ నేతి బీరకాయ సామెత మాదిరిగానే మారిపోతుంది.
