YSR Congress Party: డీఎస్సీ 2025 పై దుష్ప్రచారం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. డీఎస్సీ నియామకాల్లో అవినీతి జరిగిందన్నది ఆ పార్టీ ఆరోపణ. కానీ దీనికి సరైన ఆధారాలు చూపించడం లేదు. కోర్టుల్లో సైతం తమ వాదనలు వినిపించలేక చేతులెత్తేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగం పొందిన 16,000 మంది కంటే.. డీఎస్సీ పరీక్షలు రాసిన మూడు లక్షల మంది నిరుద్యోగ యువత పై ఆశలు పెట్టుకుంది. అహర్నిశలు శ్రమించి ఉద్యోగాలు పొందిన వారి కంటే.. వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేని లక్షలాదిమంది ఓట్లపై గురి పెట్టింది. ఓటు రాజకీయానికి తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పై ఆందోళనలు జరుపుతోంది. అయితే కేవలం రాజకీయలబ్ది కోసమే ఆ ప్రయత్నం చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం ఉపాధ్యాయ సమాజానికి తెలుసు. కానీ నిరుద్యోగ యువతలో ఒక రకమైన అపోహలు నింపి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటుంది. అయితే వైసిపి విషయాన్ని గ్రహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు నేరుగా ఆ పార్టీపై సమరభేరీ మోగించారు.
* రాష్ట్రవ్యాప్త ఆందోళన..
మెగా డీఎస్సీ పై వైసీపీ దుష్ప్రచారానికి నిరసనగా ఉపాధ్యాయులు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. అందులో భాగంగా కర్నూలులో ఉపాధ్యాయులు భారీ ఆందోళన చేపట్టారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నిబద్ధతను, ప్రామాణికతను చాటుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది అంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ శిబిరాలకు డీఎస్సీ అభ్యర్థుల మద్దతు అంతంత మాత్రమే. కానీ వారికి కావాల్సింది ప్రజల్లో అయోమయం కాబట్టి.. వైసీపీ నేతలు హడావిడి చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఉదృతం చేస్తున్న తరుణంలో.. డీఎస్సీ 2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులంతా భారీ ఆందోళనలు చేపట్టారు. మున్ముందు ఉపాధ్యాయులంతా ఏకతాటి పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
* హైకోర్టులో షాక్ తగిలినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా భావిస్తున్న జడ శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది సైతం దీనిని తప్పుపట్టారు. కనీస ఆధారాలు లేకుండా.. ఏడాదిన్నర కిందట నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో ఇది తప్పుడు చర్యగా అభివర్ణించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఏడాదిన్నర కిందట పూర్తయిన నియామక ప్రక్రియపై.. కనీస ఆధారాలు లేకుండా వైసిపి వేసిన పిటిషన్ ను విచారించకుండానే కొట్టివేసింది హైకోర్టు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు మానుకోలేదు. మరోవైపు సరైన ఆధారాలు చూపించడం లేదు. కేవలం అనుమానాలతోనే ఈ ఆందోళనలు జరుపుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఏపీ విద్యాశాఖ పూర్తిస్థాయిలో నివృత్తి చేసింది. అయినా సరే అదే ప్రయత్నాల్లో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ఉపాధ్యాయులు విసిగి వేసారి పోయారు. తమ భవిష్యత్తును, తమ నైపుణ్యాన్ని, తమ కృషిని గుర్తించకుండా రాజకీయం కోసం తమను బలి పశువు చేస్తుందన్న ఆవేదన ఉపాధ్యాయుల్లో ఉంది. అందుకే ఇప్పుడు ఉపాధ్యాయులు సైతం వీధిన పడి ఆందోళనలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్నారు.