India Pakistan : భారత్–పాకిస్తాన్ మధ్య నీటి వనరులు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉన్నాయి. గతేడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ 1960 నాటి సిందూ జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టారు. రక్తం, నీరు కలిసి పారవని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఆపితేనే సిందూ జలాల విడుదల గురించి చర్చిస్తామని భారత్ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ సిందూ జలాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. భారత్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈ క్రమంతో ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ కశ్మీర్లోని రెండు డ్యాంలలో డీసిల్టింగ్ పనులతో పాకిస్తాన్పై బురదబాబు వేయాలని నిర్ణయించారు. దీంతో వివాదం మరింత తీవ్రరూపం తీసుకుంటోంది.
రెండు డ్యాంలలో డీసిల్టింగ్ పనులు..
చినాబ్ నదిపై రియాసి జిల్లాలో ఉన్న సలాల్ డ్యాం, రాంబన్ జిల్లాలో ఉన్న బాగ్లిహార్ డ్యాంలో దశాబ్దాలుగా పేరుకున్న పూడికను తొలగించే పనులు జూలై 16 నుంచి∙26 వరకు నిర్వహించనున్నారు. ఈ డ్యాంలు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. దీర్ఘకాలంగా పూడిక పేరుకోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. డీసిల్టింగ్ తర్వాత డ్యాంల సామర్థ్యం పెరుగుతుంది. ఇది స్థానిక విద్యుత్ అవసరాలను మెరుగుపరుస్తుంది.
చారిత్రక నేపథ్యం..
1970ల నుంచి ఈ డ్యాంలలో డీసిల్టింగ్ జరగలేదు. పాకిస్తాన్ అభ్యంతరాల వల్ల మునుపటి ప్రయత్నాలు నిలిచిపోయాయి. మొరార్జీ దేశాయి ప్రభుత్వ కాలంలో స్లూయిస్ గేట్లు మూసివేయాలని ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డ్యాం ఎత్తు తగ్గించాలని కోరగా, అప్పటి ప్రభుత్వం 10 మీటర్లు తగ్గించారు. ఫలితంగా భారత్కు నష్టం, పాకిస్తాన్కు పరోక్షంగా లాభం కలిగింది.
సిందూ జలాల ఒప్పందం..
1960లో కుదిరిన సిందూ జలాల ఒప్పందం ప్రకారం చినాబ్ నది పాకిస్తాన్కు కేటాయించబడింది. అయితే భారత్కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. ఒప్పందం ప్రస్తుతం హోల్డ్లో ఉండటంతో భారత్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన భూభాగంలోని పనులు చేపట్టవచ్చు. భారత్ ఈ ఒప్పందాన్ని పునరాలోచించాలని, దాన్ని ఆధునికీకరించాలని కోరుతోంది. ఎందుకంటే అది 65 సంవత్సరాల నాటిది, ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని భారత్ వాదన.
పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం..
డీసిల్టింగ్ వల్ల వచ్చే బురద సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్లోకి చేరుతుంది. ఇది కాలువలు, హెడ్వర్క్స్ను మూసివేసే అవకాశం ఉంది. వర్షాలు పడినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. పాకిస్తాన్ దగ్గర ఈ బురదను తొలగించడానికి ముందస్తు ప్రణాళికలు లేవని తెలుస్తోంది. అదనంగా, డ్యాంలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల పాకిస్తాన్కు విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గవచ్చు. దీంతో వ్యవసాయ రంగం, ముఖ్యంగా రైతులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఈ అంశంపై చర్చలు, ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ డీసిల్టింగ్ నిర్ణయం భారత్–పాకిస్తాన్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇది రెండు దేశాల మధ్య నమ్మకం, సహకారం, భవిష్యత్తు సంబంధాలపై ప్రభావం చూపే వ్యూహాత్మక చర్య. రెండు దేశాలు బాధ్యతాయుతంగా, సంభాషణ ద్వారా ముందుకు సాగితేనే సుస్థిర పరిష్కారం సాధ్యం.
