RSS : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జెన్జీ, జెన్ ఆల్ఫా గురించి మాటలే. 25 ఏళ్ల లోపు వయసున్న తరం దేశ భవిష్యత్తును నిర్ణయించేవారు అనే అవగాహన పెరిగింది. దీంతో ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కూడా జెన్జీ కోసం పాకులాడుతుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే యువత వైపు దృష్టి పెట్టిందని చర్చలు జరుగుతున్నాయి. ముంబైలోని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న ఒక యువ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనడం ఈ చర్చను మరింత పెంచింది.
ఐఐఎంయూఎన్ కార్యక్రమం..
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఐఐఎంయూఎన్ (ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్). రిషభ్ షా స్థాపించిన ఈ సంస్థ 15 ఏళ్లుగా యువతలో నాయకత్వం, భారతీయ దృక్పథం, ప్రపంచ సమస్యలపై చర్చలు ప్రోత్సహిస్తోంది. ప్రతీ సంవత్సరం యూత్ కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థ ఈసారి 100కు పైగా ప్రధాన పట్టణాల నుంచి 15 నుంచి 19 ఏళ్ల వయసున్న వేలాది మంది విద్యార్థులను ఎంపిక చేసింది. నాలుగు రోజుల కార్యక్రమంలో వసతి సౌకర్యాలతో శిక్షణ, చర్చలు జరుగుతాయి. చివరి రోజు మోహన్ భగవత్ జెన్జీపై ప్రసంగించి, సంభాషణ జరపడం ప్రత్యేకం.
జీజేపీని చూసి నిర్వహించేది కాదు..
ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదు. సీజేపీ (కాక్రోచ్ జంతా పార్టీ) లాంటి ఉద్యమాలకు పోటీగా తెచ్చినది కూడా కాదు. 15 ఏళ్ల క్రితమే పుట్టిన ఈ సంస్థ సాధారణ వార్షిక కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. కొన్ని మీడియా, సోషల్ మీడియా వర్గాలు దీన్ని సీజేపీకి ప్రతిస్పందనగా చిత్రీకరించడం ప్రచార స్థాయిలో ఉంది. కానీ ఆహ్వానం ముందుగానే ఇచ్చినట్లు సంస్థ చెబుతోంది. భగవత్ గతంలో కూడా ఈ వేదికపై మాట్లాడారు. ఇది జెన్జీ మూడ్ను అర్థం చేసుకునే అవకాశంగా చూడవచ్చు.
ఆర్ఎస్ఎస్ యువత వ్యూహం వేరే..
ఆర్ఎస్ఎస్ ఒక తరం ముందు ఆలోచించే సంస్థగా తనను తాను చూస్తుంది. శతాబ్ది వేడుకల్లో భాగంగా మహిళలు, గిరిజనులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రూట్మార్చ్లు, సమ్మేళనాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా కార్యక్రమాలు జరిగాయి. యువ ఆయాన్ వంటి పేర్లతో యువతను కనెక్ట్ చేసే ప్లాన్లు ఉన్నాయి. కులాల మధ్య అంతరాలు, ఘర్షణలు తొలగించే దిశగా కూడా పని చేస్తోంది. ఐఐఎంయూఎన్ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా లక్షల స్థాయిలో యువ కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ విధానం తాత్కాలిక ఉద్యమాల్లా కాకుండా నిరంతర శిక్షణ, విలువలు, సంస్థాగత నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. జెన్జీని కేవలం మద్దతు కోసం పాకులాడటం కాకుండా, వారిని సంభాషణ ద్వారా అర్థం చేసుకుని, వారి ఆలోచనలను జాతీయ నిర్మాణంలో కలపాలనే దృక్పథం కనిపిస్తోంది.
మీడియాలో కొత్త చర్చ..
సీజేపీ నేపథ్యంలో జెన్జీ గురించి మాట్లాడుతుండడంతో ఆర్ఎస్ఎస్ దృష్టి పెట్టిందని కొందరు అంటున్నారు. కానీ ఐఐఎంయూఎన్ 15 ఏళ్ల చరిత్ర, ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమం ఈ వాదనను బలహీనపరుస్తాయి. ఆర్ఎస్ఎస్ యువతను తన శాఖలు, సమ్మేళనాలు, సేవా కార్యక్రమాల ద్వారా నిరంతరం కలుపుతూ వస్తోంది. ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా, విస్తృత ప్రణాళిక భాగంగా చూడాలి. జెన్జీకి కారణాలు, సంభాషణ అవసరమని గుర్తించి స్పందించడం సానుకూలం. అయితే యువత స్వతంత్రంగా ఆలోచించే తరం. వారిని కేవలం మద్దతుదారులుగా చూడకుండా, సమాన భాగస్వాములుగా చూడాలి.