Homeఆంధ్రప్రదేశ్‌లాక్ డౌన్ లో కూడా ప్రచారమా?

లాక్ డౌన్ లో కూడా ప్రచారమా?

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆందోళన చెందుతుంటే మన రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ భారీ ప్రచార కార్యక్రమాలకు తెర తీస్తున్నారు. వీరి ప్రచార యావ, ఆర్భాటం చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఒక పక్క భౌతిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తుంటే.. మరో పక్క అధికార పార్టీ నేతలే మరో ప్రచారాన్ని చేపడుతుండటం ముక్కున వేలు వేసుకునేలా చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా గత నెల 22 నుంచి రాష్ట్రంలో జన జీవనం స్తంభించింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు చేసేందుకు పనిలేక, బయటకు వెళ్లలేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన వలసదారులు చాలా సమస్యలకు గురవుతున్నారు. ఈ సమయంలో పలు సంస్థలు వారిని తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేసింది. ఈ పంపిణీలో బాధితులకు సాయం చేసే విషయం కంటే, పార్టీ ప్రచార ఆర్భాటమే ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటంతో ఆ పట్టణంలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో అక్కడ అత్యవసర రాకపోకలూ స్తంభించాయి. పట్టణంలో పరిస్థితి ఇంత టెన్షన్ గా ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం ఫ్లెక్సీ యాత్ర చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రాంతాల్లో చేసిన పార్టీ ప్రచారం ఎక్కువగా చేసుకున్నారు. కొన్ని చోట్ల మాస్క్ లపైన పార్టీ గుర్తు ముద్రించి ఇచ్చారని చెబుతున్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు సామాజిక దూరం పాటించడం లేదు.

మరోవైపు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారానికి విస్తృతంగా ఉపయోగించు కుంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘కరోనా’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోని ఆ పార్టీ ఎం.పి.టి.సి అభ్యర్థులచే అందచేయించడం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఈ అంశంపై ప్రతి పక్షాలు గవర్నర్ కు పిర్యాదు చేశాయి. అధికార పార్టీ మంత్రులు ఈ వ్యవహారాన్ని సమర్ధించుకున్నపటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తి నివారించేందుకు కృషి చేయాల్సిందిపోయి దాని వ్యాప్తి అనుకూలంగా వుండే చర్యలకు పార్టీ నాయకులు పాలపడటం వివాదాస్పదం అవుతుంది. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి చూచిస్తుంటే సేవా కార్యక్రమాల పేరుతో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రచారం నిర్వహించడం విడ్డురంగా ఉంది.

గత నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఆరు వారాలు వాయిదా పడటంతో ఆ ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు వాయిదా సమర్థిస్తూ, ఈ సమయంలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ ను ఎత్తివేస్తూ ఎన్నికలను వాయిదా వేసిన కాలంలో ప్రచారం నిర్వహించవద్దని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మాత్రం పుల్ స్టాప్ పెట్టలేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular