Excessive Exercise: ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. అయితే వ్యాయామం కూడా పరిమితికి మించి చేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రతి రోజూ గంటల తరబడి.. శారీరక శ్రమ చేయడం వల్ల ప్రాణాంతక పరిస్థితులకు దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ‘రాబ్డోమయోలైసిస్’ అనే ప్రమాదకరమైన సమస్య వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. అసలేంటిది?
తీవ్రమైన వ్యాయామం లేదా గాయాల కారణాల వల్ల కండరాల కణాలు దెబ్బతినే పరిస్థితిని రాబ్డోమయోలైసిస్ అంటారు. కండరాలు దెబ్బతిన్నప్పుడు వాటిలో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ రక్తంలోకి విడుదల అవుతుంది. ఈ మయోగ్లోబిన్ మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపి వాటి పనితీరును దెబ్బతీయవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
కొందరు వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. ఓ వ్యక్తి ఒక్కసారిగా మూడు గంటల పాటు తీవ్రమైన జిమ్ వర్కౌట్ చేస్తే అతని కండరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ సమయంలో మయోగ్లోబిన్ విడుదలై రక్తంలో కలవడంతో మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. కండరాల కణాలు దెబ్బతిన్నప్పుడు విడుదలయ్యే పొటాషియం రక్తంలో అధికమైతే గుండె స్పందన అసాధారణంగా మారే ప్రమాదం ఉంది. గుండె లయలో మార్పులు, గుండె ఆగిపోవడం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తవచ్చు.
రాబ్డోమయోలైసిస్ వచ్చినప్పుడు తీవ్రమైన కండరాల నొప్పి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. కండరాల్లో బలహీనత, వాపు, చేతులు లేదా కాళ్లు కదిలించడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉండొచ్చు. ముఖ్యంగా టీ లేదా కోలా రంగులో మూత్రం రావడం ఈ సమస్యకు ప్రధాన హెచ్చరిక సంకేతంగా భావిస్తారు.
వ్యాయామాన్ని ఒక్కసారిగా అధికంగా చేయకుండా క్రమంగా శరీరాన్ని అలవాటు చేయాలి. చాలా రోజుల తర్వాత జిమ్ ప్రారంభిస్తే తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి, శిక్షణ పొందిన ట్రైనర్ పర్యవేక్షణలోనే తీవ్రతను పెంచాలి. వ్యాయామానికి ముందు, తర్వాత తగినంత నీరు తాగడం, మధ్యలో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యం. శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు.