Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao : రామోజీరావు పై కేసు ఆ మీడియాకు వార్త కాదా?

Ramoji Rao : రామోజీరావు పై కేసు ఆ మీడియాకు వార్త కాదా?

Ramoji Rao -RK : దీని గురించి చెప్పుకునే ముందు ఒక మూడు నెలలు వెనక్కి వెళ్దాం.. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవిత పేరు తెరపైకి వచ్చింది. అది కూడా అస్పష్టమైన సమాచారంతో.. కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం కవిత ఫోటో పెద్దగా వేసి” లిక్కర్ స్కాం లో కవిత” అంటూ తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్త వేశారు.. అంతేకాదు మరుసటి రోజు కవితతో ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ కూడా చేశారు.. అలా ఎలా వేస్తారు అని కవిత అడిగితే.. నాకు ఢిల్లీ నుంచి స్పష్టమైన సమాచారం ఉందని రాధాకృష్ణ సమాధానం చెప్పారు. మరి అంతటి సమాచారం ఉన్న రాధాకృష్ణకు.. రామోజీరావు పై కేసు నమోదు అయిందన్న విషయం ఎందుకు తెలియలేదు? తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? తన పేపర్లో వార్త ఎందుకు వేయలేదు? అసలు అక్రమాలకు పాల్పడిన ఒక వ్యక్తి పై కేసు నమోదు అయితే ప్రధాన మీడియాకు ఎందుకు వార్త కాకుండా పోయింది? ఇవన్నీ బేతాళ ప్రశ్నలేం కాదు. సమాధానాలు తెలియనంత గొట్టు ప్రశ్నలు కూడా ఏమీ కాదు. “నన్ను నువ్వు కాపాడు. నిన్ను నేను కాపాడుతాను.. అంతిమంగా మనిద్దరం కలిసి శత్రువును ఓడగొడుదాం” ఇదే సూత్రంతో పచ్చ మీడియా వ్యవహరిస్తోంది.

వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శిలోని అక్రమాలను తవ్వుతున్నాడు. చంద్రబాబు ఆర్థిక స్తంభాలను ఒక్కొక్కటిగా పెకిలించి వేస్తున్నాడు. రామోజీరావును ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టలేదు. అంతటి కాకలు తీరిన రాజశేఖర్ రెడ్డి వల్ల కూడా కాలేదు. ఇక కాంగ్రెస్ హయాంలో ఉన్న మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి వల్ల కూడా కాలేదు. కానీ వీరి వల్ల కాని పనిని జగన్ చేసి చూపిస్తున్నాడు. పచ్చ మీడియా ఎంత మొత్తుకున్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు.

ఇప్పుడు ఇదే ఆ పచ్చ మీడియా కు నచ్చడం లేదు.. అందుకే రోజు ఏపీ ఎడిషన్ లో బ్యానర్ వార్తలుగా జగన్ ను ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వ పాలనలో లోపాలను తాటికాయంత అక్షరాలతో బ్యానర్ వార్తలుగా ప్రచురిస్తున్నాయి.. మరి అంతటి స్పేస్, ప్రజలపై ప్రేమ ఉన్న ఈ మీడియాకు.. రామోజీరావు మీద నమ్మదగిన కేసు ఎందుకు వార్త కాకుండా పోయింది? ఎవరి ప్రయోజనాల కోసం వీరు పనిచేస్తున్నారు? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం వార్తలు ప్రసారం చేస్తున్నారు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఆ కాంపౌండే చెబుతోంది. మా వల్ల, మా కోసం, మా కొరకు మీడియా అంటూ సరికొత్త పచ్చ మీడియా స్వామ్యాన్ని పాఠకులకు పరిచయం చేస్తోంది.

అయితే ఇదే సమయంలో సాక్షి కూడా ఆ రెండు పత్రికల బాగోతాన్ని బయటపెడుతోంది.. చంద్రబాబు హయాంలో ఆ రెండు పత్రికలు పొందిన మేళ్లను లెక్కలతో సహా వెల్లడిస్తోంది. మొత్తానికి ఈ రెండు పత్రికల తప్పును ఆపత్రిక, ఆ పత్రిక తప్పను ఈ రెండు పత్రికలు బయటపెడుతుండడంతో పాఠకులకు సరికొత్త వినోదం లభిస్తోంది. ఈ సమయంలో శ్రీ శ్రీ అన్నట్టుగా పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు అనే మాట అక్షరాల సాక్షిగా నిజమవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular