India banned china apps
కొద్దిరోజులుగా భారత్-చైనా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇటీవల భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 21మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు కూడా భారీగా మృతిచెందినా ఆ దేశం అధికారికంగా ప్రకటించలేదు. చైనా దుర్మార్గ చర్యకు ధీటుగా కేంద్రం చైనాకు చెందిన కంపెనీల కాంట్రాక్టులను రద్దు చేయడంతోపాటు 59మంది యాప్స్ ను డిలీట్ చేసింది.
ఈ పరిణమాల మధ్య కొంతకాలంపాటు చైనా వెనక్కి తగ్గినట్లు కన్పించినా మళ్లీ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గత రెండు మూడురోజులుగా భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టిక్ టాక్.. పబ్జీ యాప్స్ బ్యాన్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా కుప్పకూలుతుంది.. దీని వల్ల భారత్ కలిగే ప్రయోజనం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆ దేశానికి చెందిన యాప్స్ బ్యాన్ చేస్తే చైనాతో యుద్ధం గెలిచినట్లేనా? అంటూ నిలదీస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రధాని మోదీ గంట కొట్టమన్నారు.. చప్పట్లు కొట్టమన్నారు.. దీపాలు వెలిగించమని మాయ చేశారన్నారు. అంతేగానీ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో కేంద్రం విఫలమైందన్నారు. తాజాగా మరోసారి చైనా దురాక్రమణల నేపథ్యంలో కేంద్రం ఏకంగా పబ్జీ సహా 118యాప్ లపై నిషేధం విధించేందుకు రెడీ అవుతుంది. యాప్స్ నిషేధిస్తే బీజేపీ నేతలు చైనాతో యుద్ధం గెలిచినట్లు ప్రచారం చేసుకుంటారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు.