JanaSena: తెలంగాణలో జనసేన ప్రభావం ఎంత? బిజెపితో పొత్తు జనసేన కు లాభమా? లేకుంటే బీజేపీ కా? అసలు బిజెపి జనసేనకు సహకరిస్తుందా? క్షేత్రస్థాయిలో ఆ పార్టీ క్యాడర్ పనిచేస్తుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఇందులోఎన్ని సీట్లు సాధిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే బిజెపి నుంచి వచ్చిన సహకారంతోనే జనసేన కొన్ని సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం జనసేన తెలంగాణలో పోటీ చేసింది. 8 ఎంపీ స్థానాల్లో పోటీకి దిగింది. ఒక్కచోట కూడా సరైన ప్రభావం చూపలేకపోయింది. 8 పార్లమెంటు స్థానాల్లో కేవలం 85000 ఓట్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్క నియోజకవర్గంలో 1200 నుంచి 1500 వరకు ఓట్లు జనసేన సాధించినట్లు తెలుస్తోంది.ఇప్పుడు జనసేన తో పాటు పవన్ గ్రాఫ్ పెరగడంతో తప్పకుండా ఓట్లు పెరుగుతాయని జనసైనికులు ఆశాభావంతో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. బిజెపికి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం ఉంది. అయితే అది అర్బన్ ప్రాంతంలోనని విశ్లేషణలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతానికి సంబంధించి గ్రేటర్లో కూకట్పల్లి అసెంబ్లీ సీట్ ను బిజెపి జనసేనకు కేటాయించింది. అక్కడ సెటిలర్స్ అధికం. సినీ గ్లామర్ సైతం పనిచేస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే అక్కడ క్షేత్రస్థాయిలో బిజెపి జనసేనకు సహకారం అందిస్తే మాత్రం గెలుపు సాధ్యమని తెలుస్తోంది. మిగతా చోట్ల మాత్రం ఉనికి చాటితే చాలు అన్న రీతిలో జనసేన నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి బిజెపితో పోల్చుకుంటే జనసేనకు క్షేత్రస్థాయిలో బలం లేదు. అటు బిజెపి సైతం కొన్ని జిల్లాల్లో కనీస ప్రభావం చూపులేని స్థితిలో ఉంది. అటువంటి జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో జనసేనకు బిజెపి అధికంగా సీట్లు కేటాయించింది. కేవలం ఓడిపోతామన్న సీట్లనే తమకు కేటాయించిందని జన సైనికులు సైతం బాధపడుతున్నారు. అయితే ఇక్కడ ఓటమికి తమను ఎక్కడ బాధ్యులు చేస్తారో నన్న భయం సైతం ఉంది. అటు తెలంగాణలో ఫలితాలు సైతం.. ఏపీ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీ నుంచి ఎదురయ్యే సవాళ్లు సైతం ఊహించుకొని జనసైనికులు భయపడుతున్నారు. కానీ జనసేన నాయకత్వం మాత్రం.. గెలుపోవటములతో సంబంధం లేకుండా పోటీ చేశామని చెప్పుకోవడానికి వీలుంటుందని అభిప్రాయపడుతోంది.