ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వివిధ కేటగిరీల్లోని 10,143 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ.. ఈ జాబ్ క్యాలెండర్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. చూడడానికి ఎక్కువ ఉద్యోగాలుగానే కనిపించినప్పటికీ.. లోనికి వెళ్తే అసలు విషయం తెలుస్తుందని మొదట్లోనే విమర్శలొచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో గ్రూప్1, గ్రూప్ పోస్టులు కేవలం 36 మాత్రమే ఉన్నాయి. పోలీసు శాఖలోనూ 450 పోస్టులు మాత్రమే ప్రకటించారు. మిగిలిన ఉద్యోగాల్లో పలు డిపార్ట్ మెంట్లలోని టెక్నికల్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయనేది విమర్శకుల వాదన.
ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) నిరుద్యోగులు కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రుల ఇళ్లను సైతం ముట్టడించేందుకు ప్రయత్నించారు. తిరుపతిలో పెద్దిరెడ్డి, విజయనగరంలో బొత్స, విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ ఇళ్ల వద్ద బీజేవైఎం నేతలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ.. తమ వాయిస్ వినిపించారు నేతలు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం సరిగా లేవని, వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ వేయాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రోజు నుంచే సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. గ్రూప్స్ పోస్టులు కేవలం 36 వేయడం ఎందుకని, అవి కూడా వేయకపోతే బాగుండేది కదా అనే నిట్టూర్పులు వ్యక్తమయ్యాయి. జగన్ వస్తే.. జాబ్ వస్తుందని చెప్పి, నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని, ఇప్పుడు ఇలా చేయడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవాళ కొనసాగిన ఆందోళన.. రాబోయే రోజుల్లో మరింతగా ఉధృతమైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దీంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? అనే చర్చ కూడా సాగుతోంది. ప్రకటించిన ఉద్యోగాలతో.. నిరుద్యోగులు హ్యాపీగా ఉంటారని భావిస్తే.. అది జరగకపోగా వ్యతిరేకత వ్యక్తమవుతోందనే విషయాన్ని సర్కారు గమనించిందని అంటున్నారు. మరి, కొత్త క్యాలెండర్ ప్రకటిస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.
కానీ.. మరిన్ని జాబులు ప్రకటిస్తే.. సాలరీలకే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే.. ఉద్యోగుల జీతాల కోసం అప్పులు చేస్తున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా.. కొత్త ఉద్యోగాలు ప్రకటిస్తే ఎలా అన్న ఆందోళన కూడా ప్రభుత్వాన్ని వేధిస్తోందని అంటున్నారు. మరి, ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.