ఒక రాష్ట్రం.. ఒక దేశం.. అభివృద్ధి చెందిందని ఎలా చెబుతారు? ప్రధాన సూచికలు రెండు. ఒకటి సంక్షేమం. రెండు అభివృద్ది. సంక్షేమం అన్నప్పుడు ప్రజలకు పలు పథకాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చడం. అభివృద్ధి అన్నప్పుడు సౌకర్యాలు కల్పించడం నుంచి.. ఉపాధి అవకాశాలు చూపించడం వరకు చాలా అంశాలు ఉంటాయి. ఇవి రెండూ జోడెద్దుల్లా సమంగా, వేగంగా సాగినప్పుడే.. రాష్ట్రంకానీ, దేశంకానీ అభివృద్ధి చెందుతున్నట్టు, చెందినట్టు లెక్క.
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లు. ఇప్పటి వరకు మీరు సాధించిన అభివృద్ధి ఏంటన్న ప్రశ్నకు పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సమాధానం ఏమంటే.. తాము చేస్తున్నదే అభివృద్ధి అని. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వీటికోసం ఏడాదికి దాదాపు 70 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. కష్టాల్లో ఉన్న ఖజానాకు ఇది ఖచ్చితంగా భారమే. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. సంక్షేమానికి తొలి ప్రయారిటీ ఇవ్వడం మంచిదే. మరి, అభివృద్ధి సంగతి ఏంటన్నదే అసలు ప్రశ్న.
ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్త పరిశ్రమ వచ్చిన దాఖలాల్లేవు. పైగా.. అమరావతి వివాదం నేపథ్యంలో వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కు వెళ్లిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఏ రాష్ట్రం, దేశం పురోగమించాలన్నా.. సంక్షేమం తోపాటు అభివృద్ధి అత్యంత కీలకం. అదికూడా నిరర్థక అభివృద్ధి కాకుండా.. ఆదాయం సమకూర్చే అభివృద్ధి కావాలి. అప్పుడే ఖజానాకు నాలుగు రాళ్లు సమకూరుతాయి.
కానీ.. ఏపీలో ఇప్పటి వరకూ ఇలాంటి అడుగులు పడకపోవడం గమనించాల్సిన అంశం. సంక్షేమం కోసం ఖజానా ఖాళీ చేస్తే.. రాబడి లేకపోతే.. భవిష్యత్ ఏంటన్నది ప్రశ్న. అప్పులతోనే కాలం వెళ్లదీస్తే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఇలాంటి ప్రశ్నలు వేసినవారికి తాము చేస్తున్నదే అభివృద్ధి అని చెబుతున్నారు వైసీపీ నేతలు.
సంక్షేమాన్ని మాత్రమే చూపుతూ.. ఇదే అభివృద్ధి అని ప్రచారం చేయదలుచుకున్నట్టున్నారు. కానీ.. చెప్పుకున్నంత మాత్రాన అది అభివృద్ధి అవుతుందా? అని అంటున్నారు విశ్లేషకులు. మాటలతో మాయచేయడం పక్కనపెట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపట్టించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు.