2019 ఎన్నికల ముందు వరకు ఆయన లెక్క వేరే! అటు పార్టీ పరంగా.. ఇటు సామాజిక వర్గంలోనూ ఆయన ఓ తోపు లీడర్! కానీ.. ఇప్పుడు.. లెక్క రివర్స్ అయ్యింది. మందీమార్బలంతో హడావిడి చేసిన నేతను.. ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవట్లదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు పరిస్థితులు కొంత కారణమైతే.. స్వయంకృతాపరాధమే మిగిలిందంతా అన్నది విశ్లేషకుల వాదన! ఆయనే.. టీడీపీ నాయకుడు జ్యోతుల వెంకట అప్పారావు అలియాస్ నెహ్రూ. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప బంధువు చేతిలోనే ఓడిపోయారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ఇక జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ వైభవం గతమేనని అంటున్నారు.
Also Read: వైసీపీ చెబుతున్న ‘గోవు కథ..’!
2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిన జ్యోతులా.. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. కానీ.. ఆ తర్వాత చంద్రబాబు మాటలు నమ్మి పార్టీ మారడం ద్వారా.. తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకున్నాని అంటారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు మంత్రిపదవి ఆఫర్ చేయడంతో పార్టీ నుంచి వెళ్లిపోయాడని చెబుతుంటారు. కానీ.. పార్టీ మారిన తర్వాత మంత్రిపదవి సంగతి అటుంచితే.. స్థానికంగా అప్పటి హోం మంత్రి చినరాజప్ప, తదితరులు చాలా ఇబ్బందులకు గురిచేశారనే ప్రచారం ఉంది.
Also Read: స్టీల్ ప్లాంటు విషయంలో ఏపీ బీజేపీ మౌనరాగం..
ఆ తర్వాత జ్యోతులకు మినిస్ట్రీ ఇవ్వకపోగా.. కుమారుడికి రెండున్నరేళ్ల కాలానికి జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి సరిపెట్టారు. ఈ విధంగా.. అటు టీడీపీ చేతిలో మోసపోయిన జ్యోతులకు కాపులు కూడా దూరమయ్యారనే ప్రచారం ఉంది. కాపులకు న్యాయం చేయడం అటుంచితే.. చంద్రబాబు మనిషిగా.. కాపులకు పెద్దగా సమస్యల్లేవు అన్నట్టుగా జ్యోతుల ప్రవర్తించాడనేది వారి విమర్శ. దీంతో.. కాపుల్లో ఆయన పాపులారిటీ మొత్తం తగ్గిపోయింది. ఒక నేతగా ఆయన ప్రభావం తగ్గిపోవడంతో టీడీపీ పరంగానూ ఆయనతో ఎవ్వరూ సన్నిహితంగా లేరని చెప్పుకుంటున్నారు. తాజాగా.. పంచాయతీ ఎన్నిక ల్లోనూ నెహ్రూ హవా ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు కూడా రాజకీయంగా కాపులను వాడుకోవాల్సి వస్తే.. చినరాజప్పనే పరిగణనలోకి తీసుకుంటున్నారట. ఆ విధంగా బాబు కూడా జ్యోతులను దూరం పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీడీపీలో నెహ్రూ ఓ సాధారణ నాయకుడిగా మిగిలిపోయారని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అంతేకాదు.. నాయకత్వ సమస్యతోపాటు ఆయన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ ఫండ్ వస్తుందనే హామీ నేపథ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట జ్యోతుల. కానీ.. ఆయన గెలవలేదు. అటు పార్టీ ఫండ్ కూడా రాలేదు. దీంతో.. ఇటు ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా అన్నివిధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో.. రాబోయే ఎన్నికల్లో కుమారుడికి కాకినాడ ఎంపీ సీటు ఇప్పించుకోవడం ద్వారా.. ఆయన జగ్గంపేట వదులుకుని రాజకీయాలనుంచి నిష్క్రమించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది..? ఈ టీడీపీ జ్యోతి వెలుగుతుందా? మలిగిపోతుందా? అన్నది చూడాలి.