
రాజకీయాలు వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే విషయాన్ని పవన్ ఫ్యాన్స్ మరిచిపోతున్నట్లు ఉన్నారు. జనసేన పార్టీకి విరాళాలు సేకరించాలన్న ఆలోచనతో ఓ జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రతి జనసేన కార్యకర్త, అభిమాని రూ. 100 పార్టీకి విరాళంగా ఇవ్వాలని ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 2 కోట్లు ట్వీట్లు చేస్తూనే రూ.100 పార్టీకోసం విరాళంగా ఇవ్వాలంటూ ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తద్వారా రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలని పిలుపునిచ్చారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం వైరల్ గా మారింది. ట్వీట్ చేసిన జనసైనికుడిని జనసేన పార్టీ అధిష్టానం గుర్తించింది. అప్పటికే ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. ఒక్క ట్విటర్ పైనే కాదు ఇతర సోషల్ మీడియా సైట్స్ అంటే వాట్సాప్ లలో కూడా ఈ మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది. ఈ మెసేజ్లో జనసేన పార్టీ బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ ను ఖండించింది జనసేన పార్టీ ఉన్నత వర్గాలు. జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జనసేన… సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయొద్దంటూ అధికారికంగా అభిమానులకు పార్టీ హైకమాండ్ చెప్పలేదు. ఇదిలా ఉంటే మెసేజ్లో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు జనసేనదే అని మాత్రం పార్టీ ధృవీకరించింది.
ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార పక్షంపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పలు అంశాలపై నిప్పులు చెరుగుతోంది. వార్తల్లో నిలుస్తోంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్ కే పరిమితమవుతూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిల్లో ఆయన ప్రమేయం లేకుండా ఎదుర్కొంటున్న విమర్శలలో ఈ రూ.200 కోట్ల పార్టీ విరాళం కూడా ఒకటి. కాబట్టి పవన్ ఫ్యాన్స్ కొంచం స్పీడ్ తగ్గిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.