Saudi Pakistan Turkey Defence Pact ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా అగ్నిగుండంలా మాడింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ అమెరికాకు మద్దతు తెలుపుతున్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్దేశాలు అల్లాడుతున్నాయి. అమెరికా తీరుపై గల్ఫ్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రమేయం లేకపోయినా తాము దాడులు ఎదుర్కొనాల్సి వస్తోంది పేర్కొటుంటున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా ఇరాన్ దాడులు ఎదుర్కొనే విషయంలో ఓ కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఒపెక్ నుంచి వైదొలిగిన సౌదీ ఇప్పుడు ఇరాన్ దాడులు ఎదుర్కొనేందుకు పాకిస్తాన్, తుర్కియే(టర్కీ)తో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈæ ఒప్పందం పశ్చిమాసియా భద్రతా వ్యూహాల్లో ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంత అనిశ్చితి నేపథ్యంలో జరిగిన ఈ అవగాహన ఒక దేశంపై దాడిని మూడింటిపై దాడిగా పరిగణించేలా రూపొందింది.
ఒప్పందంలోని అంశాలు..
మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నాయకులు ఈ అవగాహనపై సంతకాలు చేశారు. ఉమ్మడి నిరోధక శక్తిని పెంచడం, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించడం ప్రధాన లక్ష్యాలు. ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా మిగిలినవి దాన్ని తమపై జరిగినట్లుగా చూసే నిబంధన ఉంది. అయితే నిర్దిష్ట సైనిక బాధ్యతలు లేదా స్పష్టమైన చర్యా ప్రణాళికలు బహిరంగంగా వెల్లడి కాలేదు. ఇది రక్షణ సహకారం, సమన్వయం పెంచే దిశగా ముందుకు సాగుతుంది.
సౌదీ వ్యూహంలో మార్పు
రియాద్ గతంలో ఒకే భాగస్వామిపై ఎక్కువగా ఆధారపడేది. ఇటీవల చమురు సౌకర్యాలు, మౌలిక వసతులపై జరిగిన దాడులు, ప్రాంతీయ అస్థిరత కారణంగా భద్రతా భాగస్వామ్యాలను వైవిధ్యపరచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త అవగాహన ద్వారా అదనపు నిరోధక శక్తిని సాధించాలని భావిస్తోంది. అమెరికా వంటి సాంప్రదాయ మిత్రులతో సంబంధాలు కొనసాగుతూనే, ఇతర ఇస్లామిక్ దేశాలతో సమష్టి వ్యూహాలు రూపొందించడం దీని ఉద్దేశ్యం.
ఇరాన్ ప్రతిస్పందన
తెహ్రాన్ ఈ అవగాహనను కాగితపు స్థాయిలోనిదిగా అభివర్ణించింది. దీర్ఘకాలంగా కొనసాగిన సంబంధాలు కూడా పూర్తి భద్రతను అందించలేదని, విధానాలు మార్చుకుంటే బయటి ఆధారం అవసరం ఉండదని వ్యాఖ్యానించింది. ఇది ప్రాంతీయ పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. ఒక వైపు ఇరాన్ తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, మరోవైపు ఈ మూడు దేశాలు సమష్టి నిరోధకతను బలపరుస్తున్నాయి.
పరస్పర రక్షణ సాధ్యమేనా?
ఈ అవగాహన దక్షిణాసియా సందర్భంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే పరస్పర రక్షణ నిబంధన ఎలా వర్తిస్తుందనేది చర్చనీయాంశం. అయితే ఇలాంటి ఒప్పందాల్లో ప్రతిస్పందన రకం, సైనిక లేదా దౌత్య మద్దతు స్థాయి ఆయా దేశాల స్వతంత్ర నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. తక్షణ సైనిక జోక్యం తప్పనిసరి కాదు. భారత్ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.
ఇరాన్ దాడుల నుంచి గల్ఫ్ దేశాలను కాపాడడం అగ్రరాజ్యం అమెరికాతోనే కాలేదు. చివరకు అగ్రరాజ్యం చేతులు ఎత్తేసింది. శాంతిమంత్రం పటిస్తోంది. ఈ సమయంలో తాజా కూటమి మధ్యప్రాచ్య శక్తి సమీకరణాల్లో కొత్త ధోరణిని సూచిస్తోంది. సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరించడం, టర్కీ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలు, పాకిస్తాన్ అణు సామర్థ్యం కలిసి వచ్చాయి. అయితే దీని విజయం అమలు స్థాయి, సహకారం, ప్రాంతీయ ఉద్రిక్తతల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఇది శాంతి స్థిరత్వానికి దోహదం చేస్తుందా లేదా కొత్త పోటీలను రేకెత్తిస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుంది.