Police Cases Against Revanth: ‘కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.. వారి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుడ్డలిప్పదీస్తం. అసలు, మిత్తీతోని చెల్లిస్తం’ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. వీటిని సీరియస్గా తీసుకున్న పోలీసులు అధికారుల సంఘం నేతలు చెలరేగిపోతున్నారు. ఊరూవాడా ప్రతీ పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. తమ మనోభావాలను రేవంత్ రెడ్డి దెబ్బ తీశారని వారి అభియోగం. రేవంత్రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కేసులు..
రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్పై కేసులు నమోదయ్యాయి. ఏపీలోనే అనుకుంటేం తెలంగాణ పోలీసు సంఘాలు కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యాయి. పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ‘రెడ్ డైరీ’ అంటే ఏమిటి? అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? .. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని చెబుతున్నారు.
బీఆర్ఎస్ తొత్తులు అనడానికి నిదర్శనం..
ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పోలీసులు
బీఆర్ఎస్కు తొత్తులుగా మారారనడానికి టీపీసీసీ అధ్యక్షునిపై పెడుతున్న కేసులే నిదర్శనమంటున్నారు. కొంతమంది పోలీసుల గురించి మాట్లాడితే అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ నేతలపై కుట్రలు చేస్తున్న వారిని మత్రమే రేవంత్ అంటున్నామని చెబుతున్నారు.
నాడు ఏదీ ఈ పౌరుషం..
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీశ్రావు పోలీసులను దుర్భాషలాడారని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. నాడు లేవని పోలీస్ అధికారుల సంఘం నేతల నోళ్లు ఇప్పుడు లేవడమే ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. తమను తిట్టిన వారికే నేడు ఊడిగం చేస్తున్న కొంతమందిని ఉద్దేవించి రేవంత్ వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారిపోయింది.