Homeఆంధ్రప్రదేశ్‌జగన్ - బిజెపి సంధానకర్తగా రాంమాధవ్!

జగన్ – బిజెపి సంధానకర్తగా రాంమాధవ్!


బిజెపి, టిడిపి పొత్తులో కొనసాగిన సమయంలో టిడిపికి వ్యతిరేకంగా బీజేపీలోని వర్గాలను సమీకరించడంలో కీలక పాత్ర వహించిన బిజెపి ప్రధాన కార్యదర్శి వి రాంమాధవ్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, బిజెపి లకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారా? జగన్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకొంటున్న సమయంలో రాంమాధవ్ మాట్లాడిన మాటలు వింటుంటే అవుననిపిస్తుంది.

మొదట్లో జగన్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఏపీలోని బిజెపి నేతలు అందరు కొంతకాలంగా మౌనంగా ఉండటం గమనార్హం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంకా గళం విప్పుతున్నప్పటికీ ఆయనకు పార్టీలో ఇతరులు ఎవ్వరు సహకరించడం లేదు.

జగన్ అధికారమలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఆయన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని అంటూ కితాబు ఇచ్చారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును తప్పుపడుతూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజుననే రాంమాధవ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పైగా అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదని విమర్శకులకు హితవు పలికారు. ఆయన సొంత పార్టీలో జగన్ ను విమర్శిస్తున్న వారికి హితవు చెప్పారా లేదా టిడిపి నేతలను దృష్టిలో ఉంచుకొని అన్నారా అనేది తెలియడం లేదు.

మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేసిన రాంమాధవ్ తామిద్దరి మధ్య మంచి సంబంధం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. పార్లమెంట్‌లో నిర్ణయాలకు వైఎస్ఆర్‌సీపీ నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.

ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి పనిచేస్తున్నారని అంటూ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి కన్నాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంలో రాంమాధవ్ కీలక పాత్ర వహించారు. నాటి కేంద్ర మంత్రి ఏం వెంకయ్యనాయుడుకు తెలియకుండా కన్నాను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు తీసుకువెళ్లి చేర్పించారు. కన్నా తొలినుండి టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకంతో ఉంటూ ఉండడంతో అప్పట్లో టిడిపి బిజెపితో పొత్తులో ఉన్నా ఆ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తుండేవారు.

జగన్ సీఎం కావడంలో బీజేపీలోని కొందరు నేతలు కీలక పాత్ర వహించారు. వారిలో రాంమాధవ్ కూడా ఉన్నారు. అటువంటి జగన్ పాలనలోని తప్పులను కూడా కన్నా ప్రస్తావిస్తూ ఉండడంతో క్రమంగా ఆయనను రాంమాధవ్ దూరంగా నెట్టివేస్తూ వచ్చారని తెలుస్తున్నది. రాంమాధవ్, జివిఎల్ నరసింహారావు ఒకజట్టుగా ఢిల్లీలో బిజెపి అధిష్ఠానం వద్ద జగన్ అనుకూలంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular