Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అయితే ఈ ఉద్యమం వెనుక ఎన్డీఏ వ్యతిరేక రాజకీయ పక్షాల మద్దతు ఉంది. ఆ పార్టీల ప్రోద్బలంతోనే ఆ ఉద్యమం సక్సెస్ అయ్యింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు, రాజకీయ పార్టీలు స్పందించాయి. ఏపీలో ఎన్డీఏ వ్యతిరేక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై నోరు తెరవలేదు. కనీసం మాట్లాడలేదు. డీఎస్సీలో అక్రమాలు అంటూ నానా హంగామా చేస్తున్న ఆ పార్టీ.. నీట్ ప్రశ్న పత్రాల విషయంలో ఎందుకు స్పందించలేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కోపం వస్తుందని.. ఓ అరుదైన అవకాశాన్ని మాత్రం ఆ పార్టీ జారవిడుచుకుంది.
* ఇప్పటికీ స్పందన లేదు..
దేశవ్యాప్తంగా ఇప్పుడు జనతా కాక్రోచ్ ఉద్యమం ఫలితం చర్చ జరుగుతోంది. తమ పార్టీని కూడా జనతా కాక్రోచ్ తో కొద్ది రోజుల కిందట పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఉద్యమం నేపథ్యం, విద్యార్థులతో పాటు నిరుద్యోగులు చేస్తున్న పోరాటం విషయంలో మాత్రం స్పందించలేకపోయింది. దీనిపైన ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. జనతా కాక్రోచ్ ఉద్యమం పై రాజకీయ పార్టీల ప్రభావం లేదు కానీ.. భారతీయ జనతా పార్టీ హవాను తగ్గించేందుకు ఇటువంటి ఉద్యమాలు రావాలని కోరుకున్నాయి ఇతర రాజకీయ పార్టీలు. తెర వెనుక మద్దతు ఇవ్వడంతోనే ఇంత పెద్ద ఉద్యమం విజయవంతం అయింది. కానీ ఈ ఉద్యమం తెర వెనుక కూడా మద్దతు ఇవ్వకపోగా కనీసం స్పందించిన దాఖలాలు లేవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* డీఎస్సీ పై బురద..
నీట్ ప్రశ్న పత్రాలు లీకేజీ వ్యవహారం తర్వాతనే డీఎస్సీ నియామక ప్రక్రియపై దృష్టి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో ఏడాది కిందట డీఎస్సీ నిర్వహణ జరిగింది. దాదాపు 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. ఏడాది పాటు విద్యా బోధన కూడా పూర్తి చేసుకున్నారు. అయినా సరే ఆ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా జరపలేదని టిడిపి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనేది వాస్తవంగా జరిగిన దానిపై కనీస స్థాయిలో స్పందించలేదు. పొరుగున తెలంగాణలో స్నేహితుడైన కేటీఆర్ స్పందించారు కానీ జగన్మోహన్ రెడ్డి దానిపై స్పందించలేదు. పైగా తమ వైసిపి పోరాటాలను జనతా కాక్రోచ్ ఉద్యమాలతో పోల్చుకున్నారు. ఇప్పుడు జగన్ వైఖరి పైనే జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది.





