CJP : నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నడిపిన ఉద్యమం ఇటీవల దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్యమం పైకి ఆగినట్లు కనిపించినా, విశ్లేషకులు దీన్ని కేవలం తాత్కాలిక ఎత్తుగడగా చూస్తున్నారు. సీజేపీ ఇప్పుడు వ్యవస్థలో నిలబడి, ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత కూటమి నిర్మించాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
మంత్రి రాజీనామాతో మలుపు
విద్యార్థుల నిరసనలు మంత్రి రాజీనామాకు దారితీశాయి. ఇది ఉద్యమకారులకు తక్షణ విజయంగా కనిపించినా, సీజేపీకి అసలు లక్ష్యం అంతకు మించినదని స్పష్టమవుతోంది. రాజీనామా తర్వాత ప్రధాన ఇష్యూ కనుమరుగైంది. విద్యార్థులపై అనేక కేసులు నమోదయ్యాయి. దాడులు, రాళ్లు విసిరినవారిని గుర్తించడంతో పలువురు మళ్లీ ఉద్యమానికి రావడం కష్టమైంది. ఫలితంగా బహిరంగ నిరసనలు ఆగిపోయాయి. అయినా సీజేపీ సీనియర్ కార్యకర్తల కార్యకలాపాలు ఆగలేదు. వారు వివిధ వ్యక్తులను కలుస్తూ, వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కీలక నేతల ప్రవేశం సమావేశం..
సీజేపీలో అశుతోష్ రాంకా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆప్తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈయన ఇప్పుడు సీజేపీలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. దీపికా బలీయ కూడా ముందుకు వచ్చారు. జాట్ సమాజానికి చెందిన ఈ మహిళా నేత ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా సమావేశానికి హాజరై కేంద్ర వ్యతిరేక స్వరం వినిపించారు. అక్కడే రైతు నేత రాకేశ్ టికాయత్ను కలిశారు. 2020–21 రైతు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టికాయత్తో సంపర్కాలు సీజేపీకి రైతు శక్తిని చేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ నేతలు, ఆజాద్ సమాజ్ పార్టీ, ఆప్ నాయకులతోనూ చర్చలు జరిగాయి. యాంటీ బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ఏకీకృత పోరాటం చేయాలనే లక్ష్యంతో ఈ భేటీలు సాగుతున్నాయి. రాకేశ్ టికాయత్కు ఉత్తరప్రదేశ్ జాట్ సమాజంలో పట్టు ఉంది. అజీత్సింగ్, హరియాణాలోని ఓం ప్రకాశ్ చౌతాల కుటుంబం వంటి జాట్ నాయకులతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ ఓట్లను బీజేపీ నుంచి దూరం చేయడమే లక్ష్యం.
రైతు ఉద్యమ అనుభవంతో..
2021–22 రైతు ఉద్యమంలో ఢిల్లీకి వచ్చే రోడ్లు దిగ్బంధించిన అనుభవాన్ని సీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. అప్పటి సంఘటనల్లో ఎర్రకోట వద్ద జరిగిన కొన్ని సంఘటనలు, ఒక ఉద్యమకారుడి మరణం వంటివి ఇప్పటికీ చర్చనీయాంశాలే. అయితే ప్రస్తుతం సీజేపీ మరింత విస్తృత బేస్ నిర్మించడంపై దృష్టి సారించింది. విద్యార్థుల్లోని యాంటీ మోదీ సెంటిమెంట్ను రైతు సంఘాలు, విపక్షాలతో కలిపి యూపీ, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయాలని భావిస్తోంది. ప్రాంతీయ పార్టీలకు లబ్ధి చేకూర్చే వ్యూహాలు రూపొందుతున్నాయి. కాంగ్రెస్ కూడా సీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తోంది.
మంత్రి రాజీనామాతో సీజేపీకి స్పష్టమైన విజయంగా చెప్పుకునే అవకాశం తగ్గింది. విద్యార్థుల ఉద్యమం ఆగిపోవడం, కేసులు నమోదు కావడం పెద్ద సవాళ్లు. అయినా సైలెంట్గా సాగుతున్న ప్రయత్నాలు, కీలక నేతల సంపర్కాలు చూస్తే ఉద్యమం పూర్తిగా ఆగిపోలేదని స్పష్టం. రాజకీయాల్లో బలమైన శక్తిగా మారాలనే లక్ష్యంతో సీజేపీ కదులుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో, యాంటీ బీజేపీ ఫ్రంట్ ఎలా రూపుదిద్దుకుంటుందో రాబోయే నెలల్లోనే స్పష్టమవుతుంది.