Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ ను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల ద్వారా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లా కాశీనాయన మండలం పరిధిలోని వరి కుంట్ల సమీపంలో భారీ ఎర్రచందనం డంప్ పట్టుబడింది. దాదాపు కోటిన్నర విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను, వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను అరెస్టు చేశారు.
అటవీ శాఖ తీసుకున్న తర్వాత..
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు. అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతూ వస్తున్నారు. తాజాగా ఆపరేషన్ అరణ్య చురుగ్గా చేపట్టాలని నిర్ణయించారు. ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించేందుకుగాను అటవీ శాఖ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ పటిష్ట చర్యలతోనే స్మగ్లింగ్ కొంతవరకు నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇప్పుడు భారీ డంప్ తరలిస్తుండడంతో మళ్ళీ ప్రారంభం అయినట్లు అర్థం అవుతోంది. అందుకే అధికారులతో సమీక్షించారు పవన్ కళ్యాణ్. వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు.. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు అని పవన్ భావిస్తున్నారు.
ఇతర రాష్ట్ర బృందాలు..
ప్రధానంగా రాయలసీమలో ఎర్రచందనం ముఠాల వెనుక స్థానిక నాయకులతో పాటు బెంగళూరు, హర్యానా, కోల్కత్తా ప్రాంతాలకు చెందిన సూత్రధారులు ఉన్నారు. ప్రధానంగా తమిళ నాడులోని కూలీలను తీసుకొచ్చి.. ఈ అక్రమ దందాలో వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఎర్రచందనం భారీగా తరలిపోయింది. అయితే అటవీ శాఖకు సంబంధించి ప్రత్యేక దళాల ఏర్పాటు, ఇతర అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన శాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న వారిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అటువంటి వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పవన్ అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఈ స్మగ్లింగ్ కు సహకరిస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాత్ర పై కూడా పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పవన్ పుష్పరాజులపై గట్టిగానే దృష్టి పెట్టారు.







