Homeజాతీయ వార్తలుపీకే నెక్ట్స్‌ టార్గెట్‌ పంజాబ్

పీకే నెక్ట్స్‌ టార్గెట్‌ పంజాబ్

Prashant Kishor

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌‌.. ఆయన ఏ రాష్ట్రంలో.. ఏ పార్టీకి పనిచేసినా ఆ స్థాయిలో రిజల్ట్‌ తెచ్చి చూపిస్తారు. రాజకీయాలను అంచనా వేయడంలోనూ.. ప్రత్యర్థులను దెబ్బతీయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా ఆ పార్టీ విజయం తథ్యం. అందుకే.. ఆయనకు దేశవ్యాప్తంగా డిమాండ్‌. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్‌మోహన్‌ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు సాధించిపెట్టారు. అటు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌‌లోనూ తన వ్యూహాలతో అధికార పీఠం ఎక్కించారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. తాను ఓకే చేసిన ప్రతి రాష్ట్రంలోనూ తన క్లయింట్లకు విజయాన్ని చేరువ చేసి.. అధికార దండం వారి చేతుల్లోకి వచ్చేలా చేయటంలో పీకే రూటు సపరేటు అనే చెప్పాలి.

ఎక్కడైనా సరే.. తనను నమ్ముకొని తనను ఎన్నికల వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్న వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటంతో పీకే ట్రాక్ రికార్డును ఏ మాత్రం వంక పెట్టలేం. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో డీఎంకే.. టీఎంసీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఇక ఆ పనిని పూర్తి చేశారు. ఇప్పటివరకు వెలువడుతున్న అంచనాల్ని చూస్తే.. రెండు రాష్ట్రాల్లో తాను సేవలు అందించిన పార్టీలే విజయం సాధిస్తాయని చెబుతున్నారు. మరి.. తర్వాతి పీకే తర్వాతి టార్గెట్ ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెలఖరులో బెంగాల్ చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే.. ఆయన పంజాబ్ కు వెళ్లనున్నారు. బెంగాల్ బాధ్యత పూర్తయిన వెంటనే.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తిరిగి సీఎం పీఠం మీద కూర్చోబెట్టటమే పీకే లక్ష్యమని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా అమరీందర్ సింగ్‌కు ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్‌‌గా నియమితులయ్యారు.

మే నుంచి పీకే సేవలు మొత్తం పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీకే అందించనున్నారు. ఆయన మేజిక్ రిపీట్ అయితే.. కాంగ్రెస్ కు కొత్త జోష్ ఖాయమని చెప్పక తప్పదు. కాగా.. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం తాజాగా బీజేపీని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ అధినేత్రి మమతా బెనర్జీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెడుతున్న ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి పరాజయం తప్పదని పదే పదే చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular