Homeజాతీయ వార్తలుసామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు


దేశంలో కరోనా పంజా విసురుతుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ఎంట్రీతో దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడింది. లాక్డౌన్ ఇలానే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని భావించిన కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్రాలకు తిరిగి ఆదాయం వస్తోంది. అయితే కరోనా కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా స్పెషల్ ట్యాక్స్ లు విధిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలో లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగులు కోల్పోవాల్సిన పరిస్థితి. అనేకమంది ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఉద్యోగుల జీతాల్లో సగానికి కోతపెట్టింది. మూడునెలలుగా సగం జీతంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మూడునెలల కరెంటు బిల్లు ఒకేసారి స్లాబులు మార్చి ఇవ్వడంతో వేలల్లో బిల్లు రావడంతో పేదప్రజలు లబోదిబోమంటున్నారు. మద్యం రేట్లను 15శాతంవరకు పెంచి మద్యంప్రియులను జేబులను కొల్లగొడుతోంది. తెలంగాణలో కరోనా టెస్టులపై పకడ్బంధీ చర్యలు చేపట్టని ప్రభుత్వం ఆదాయంపై మాత్రం దృష్టిసారిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

మరోవైపు కేంద్రం కరోనా సమయంలో వలస కార్మికులను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు పెద్దఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో కేంద్రం 20లక్షల స్పెషల్ ప్యాకెజీనీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల సామాన్యుడికి ఒరిగేందేమీలేదని అంటున్నారు. 20లక్షల స్పెషల్ ప్యాకేజీ మేడిపండు చందంగా ఉందని విమర్శులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కేంద్రం గత 11రోజులుగా పెట్రోలు ధరలను పెంచుతుండటంపై సామాన్యులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం కూడా లీటరు పెట్రోల్ మీద 55 పైసలు పెంచితే.. డీజిల్ మీద 60 పైసలు పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 11 రోజుల్లో లీటరు పెట్రోల్ మీద రూ.6.02 పెరిగితే డీజిల్ పై రూ.6.40 పెరిగింది. తాజాగా పెంచిన ధరలతో తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ.80.22లకు చేరగా డీజిల్ రూ.74.07గా చేరింది. ఇక ఏపీలో పెట్రోల్ ధర రూ.80.66కు చేరితే.. డీజిల్ రూ.74.54గా మారింది. కేంద్ర సర్కార్ ఆదాయం పెంచుకోవడంపై దృష్టిపెట్టడంతో రానున్న రోజుల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ పడుతుంది. దీంతో అన్ని వస్తువుల ధరలు పెరగడం ఖాయం. కరోనా కాలంలోనూ మోడీ సర్కార్ ప్రజలపై పగబట్టినట్లు పన్నులు విధిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular