Toddy Theft: ఇప్పుడు అంటే మద్యం ప్రతి గ్రామంలో ఏరులై పారుతుంది. మంచినీళ్లు దొరకకపోయినప్పటికీ తాగడానికి మాత్రం మందు దొరుకుతుంది. దీనిని బట్టి ప్రభుత్వాలు కేవలం మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికి ఎటువంటి విధానాలకు పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
మద్యం ఇప్పుడంటే విరివిగా లభిస్తోంది. కానీ ఒకప్పుడు తెలంగాణ గ్రామాలలో కల్లు విరివిగా దొరికేది. గీత వృత్తిని చాలామంది కార్మికులు వంశపారంపర్యంగా నాడు కొనసాగించేవారు. అందువల్లే గ్రామాలలో కల్లు బ్రహ్మాండంగా దొరికేది. నాడు గీత వృత్తిమీద వేలాదిమంది కార్మికులు ఆధారపడి జీవించేవారు. పరోక్షంగా లక్షల మంది ఉపాధి పొందేవారు. ఎప్పుడైతే మద్యం తయారీ పెరిగిపోయిందో కల్లు తాగే వారి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్రామాలలో కూడా గీత వృత్తి కొనసాగుతూనే ఉంది.
కల్లు గీసే వారి సంఖ్య తక్కువగా ఉండడం.. అందువల్లే దానికి డిమాండ్ పెరగడంతో కొంతమంది దొంగతనానికి పాల్పడడం మొదలుపెట్టారు. దొంగ చాటుగా తాటి చెట్లను ఎక్కి.. కళ్ళు తీయడం ప్రారంభించారు. ఇది గీత కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఓ గౌడ కార్మికుడు తన తాటి చెట్టుకు సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. తద్వారా తాటికల్లు దొంగతనం కాకుండా కాపాడుకున్నాడు. ఇతడి ప్రయత్నాన్ని చాలామంది అభినందిస్తున్నారు. ప్రస్తుతం మోత్కూరులో ఒక బాటిల్ కల్లు ధర 250 వరకు పలుకుతోంది. సీజన్లో అయితే 300 కూడా పలుకుతుంది. ఒక చెట్టుకు దాదాపు నాలుగు బాటిల్ వరకు కల్లు పారుతుంది. ఈ ప్రకారం రోజుకు 1200 వరకు లభిస్తాయి. నాన్ సీజన్లో అయితే 800 వరకు లభిస్తాయి. అందువల్లే ఆ గీత కార్మికుడు ఆ చెట్టుకు సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు.
సీసీ కెమెరా ద్వారా నిత్యం తాటి చెట్టును పర్యవేక్షించడం ద్వారా దొంగలు కల్లు తీయడానికి వెనుకాడటం మొదలుపెట్టారు. దీంతో ఆ కార్మికుడి శ్రమ ఫలించింది. సీసీ కెమెరా ఏర్పాటు ద్వారా అతనికి లాభం జరిగింది. కొన్నిసార్లు స్మార్ట్ గా ఆలోచిస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో.. ఈ ఉదంతం నిరూపించింది. అందువల్లే సాధ్యమైనంతవరకు గీత కార్మికులు ఇటువంటి స్మార్ట్ విధానాలను అవలంబించాలి. అప్పుడే వారు పడే కష్టానికి గట్టి ఫలం లభిస్తుంది. ఆశించిన మేర ఆదాయం లభిస్తుంది.
కల్లు గీస్తే దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఏకంగా తాటిచెట్టుకే సీసీ కెమెరాను ఏర్పాటు చేసిన గీత కార్మికుడు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఘటన
గీస్తున్న కల్లును గుర్తుతెలియని దొంగలు రాత్రివేళల్లో దొంగలించడంతో సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేసిన గీత కార్మికుడు అన్నెపు శ్రవణ్ గౌడ్. pic.twitter.com/NhARKz3g2s
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026