ఎప్పుడు విమర్శించేవాడు ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా అంటున్నాయి వైసీపీ శ్రేణులు.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కానీ పొగిడిన సందర్భం లేదని చెప్పవచ్చు. తాజాగా సీఎం జగన్ ఏపీలో వెయ్యికిపైగా అంబులెన్స్ లను ఒకేరోజు ప్రారంభించారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను పొగుడుతూ చేసిన ట్వీట్ మరో ఎత్తయింది. పవన్ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నాయి.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా పవన్ కల్యాణ్ విమర్శిస్తూనే వస్తున్నారు. జగన్ మంచి పనులు చేసినా విమర్శలు గుప్పించే పవన్ సడన్ గా సీఎం జగన్ ను పొగుడుతూ ట్వీట్ చేయడంతో వైసీపీ శ్రేణులు విస్కృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైసీసీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు జగన్ మంచి పనులు కనిపించడం హర్షనీయమని కామెంట్లు చేస్తున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు మెగాస్టార్ ఎల్లప్పుడు ప్రశంసిస్తుంటారని పేర్కొంటున్నారు. అదేవిధంగా మెగాబ్రదర్ నాగబాబు సైతం ఇటీవల జగన్ చేస్తున్న మంచి పనులకు వత్తాసు పలికాడని, చంద్రబాబు, పచ్చమీడియా విసయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు మెగాబ్రదర్ నాగబాబు మద్దతు పలికారని గుర్తు చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం జగన్మోహన్ రెడ్డిని పొగడటం అభినందనీయమని అంటున్నారు.
ఇన్నాళ్లకు జగన్ చేసే మంచి నిర్ణయాలను పవన్ గుర్తించడం, మెగా ఫ్యామిలీ మొత్తం సీఎం జగన్ మంచి పనులకు బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పవన్ ఒక్క ట్వీట్ వైసీపీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులంతా ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు జనసేన కార్యకర్తలు సైతం సీఎం జగన్ మంచి పని చేస్తే.. మంచి చేశాడని.. చెడుచేస్తే చెడును విమర్శిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలా ఇరుపార్టీలు పవన్ ట్వీట్ ను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.