Pawan Kalyan : పార్టీ బలోపేతం పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశంలో జెన్ జీ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన ను సైతం అదే స్థాయిలో ఆధునికరించాలని భావిస్తున్నారు పవన్. యువతరానికి పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. కేవలం సాంప్రదాయ రాజకీయాలకు పరిమితం కాకుండా.. మారుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆధునిక ఆలోచన విధానాలకు అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని తీర్చిదిద్దేందుకు పవన్ గట్టి చర్యలే ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 మందిని బాధ్యతలు నుంచి తప్పించారు. నూతన నియామకాలు పూర్తయ్యే వరకు టీవీ డిబేట్లు, మీడియా సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించారు.
* యువతకు ప్రాధాన్యం..
జనసేనలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. కొత్త కమిటీల నియామకం పై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈసారి చదువుకున్న వారితో పాటు ఐటీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి స్థానం కల్పించునున్నారు. వచ్చే నెలలో కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఆది నుంచి యువతకు పార్టీలో పెద్దపీట వేశారు. కానీ జెన్ జీ తరహాలో పోరాటాలకు సిద్ధంగా ఉండేలా.. పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దేలా.. కొత్తతరం వాయిస్ పార్టీలో స్పష్టంగా వినిపించాలనే లక్ష్యంతోనే ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* మొత్తం కొత్త కమిటీలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ప్రకాశంతో పాటు నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీల బాధ్యతలను క్షేత్రస్థాయి క్యాడర్ కి అప్పగించారు. ఈ వరుస నిర్ణయాలు కొనసాగింపుగానే ఇప్పుడు రాష్ట్రస్థాయి కమిటీని రద్దు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు 26 మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. వీరి బాధ్యతలను రద్దు చేస్తూ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త కమిటీల నియామకం జరిగే వరకు టీవీ డిబేట్లో, మీడియా సమావేశాల్లో మాట్లాడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి.
* ఆ స్ఫూర్తితో..
దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది జెన్ జీ ఉద్యమం. దానిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీలో యువతతో పాటు విద్యాధికులకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు, సామాజిక విషయాలపై అవగాహన ఉన్న యువతను ప్రోత్సహించి.. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గొప్ప సంకేతం పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.