Pawan Kalyan Varahi Yatra: పవన్ మూడు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ యాత్రను పూర్తి చేశారు.అటు తరువాత విశాఖలో కొనసాగించారు. ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. త్వరలో ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో యాత్ర జరుపుతారని భావించారు. కానీ పవన్ అనూహ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తదుపరి యాత్ర చేపట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్ పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. సెప్టెంబరు, అక్టోబర్లో వీలైనంత వరకూ సినిమా షూటింగులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. నవంబరు నుంచి ఎన్నికల గోదాలోకి దిగాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వారాహి యాత్ర పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలోని మిగిలిన రెండు జిల్లాల్లో యాత్ర పెండింగ్లో ఉంది. నవంబర్లో ఈ రెండు జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నట్లు జనసేన వర్గాలు భావిస్తూ వచ్చాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో పవన్ చూపు రాయలసీమ వైపు పడినట్లు టాక్ నడుస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పట్టు బిగించేందుకు వారాహి యాత్ర ఎంతగానో దోహదపడుతుందని పవన్ భావిస్తున్నారు.
రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. అందుకే అక్కడ ఈ ఎన్నికల్లో వైసిపి దూకుడు తగ్గించాలని పవన్ భావిస్తున్నారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ. వారిని తన వైపు తిప్పుకునేందుకే అక్కడ పవన్ వ్యూహం పన్నుతున్నారు. రాయలసీమ నుంచి జనసేనకు కనీస ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కనీసం 15 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఉన్నా.. లేకపోయినా రాయలసీమలో జనసేన ప్రాతినిధ్యం పెరగాలన్నదే పవన్ ఆలోచన. ఒకవేళ జనసేనతో పొత్తు ఉన్నా.. అది ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. 13 జిల్లాల్లో ప్రతి చోట మూడు నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా తీసుకోవాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే అన్ని ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని బలమైన ఆలోచనతో పవన్ పని చేస్తున్నట్లు సమాచారం. అందుకే పవన్ మనసు రాయలసీమపై పడినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. సో వారాహి యాత్ర రాయలసీమలో నాలుగో విడత పూర్తి చేసుకోనుందన్నమాట.