Chandrababu: ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు వారం రోజుల కిందట ఖాళీ అయ్యాయి. అయితే ఈ ఇద్దరి పేర్లను నామినేట్ చేసే పూర్తి అధికారం రాజ్యాంగబద్ధంగా క్యాబినెట్ ద్వారా ప్రభుత్వానికి ఉంది. కానీ ఎందుకో జాప్యం జరుగుతోంది. క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై అసలు చర్చ జరగలేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి క్యాబినెట్ తీర్మానం రూపంలో సిఫారసు వెళ్లిన సమయం నుంచే.. ఆయా ఎమ్మెల్సీల ఆరేళ్ల పదవీకాలం లెక్కింపులోకి వస్తుంది. అయితే ఎందుకో ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ రెండు ఎమ్మెల్సీల భర్తీపై పెద్దగా దృష్టి సారించడం లేదు.
* భర్తీ జరిగిన నాటి నుంచి ఆరేళ్లు..
ఎప్పుడైతే భర్తీ చేస్తారో నాటి నుంచి ఈ ఎమ్మెల్సీ పదవులు ఆరేళ్ల పాటు కొనసాగుతాయి. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే ఈ పదవులను ఖాళీగా ఉంచడం రాజకీయంగా సరైన వ్యూహం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. చట్టసభల్లో నిరంతరం భాగస్వామ్య పార్టీల బలాన్ని, ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సిన సమయంలో ఈ నియామకాల్లో జాప్యం జరపడం వల్ల ఆశావహుల్లో ఒక రకమైన నిరాశ తప్పదు.
* ఆ నిబంధనలు..
సాధారణంగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసి ఎమ్మెల్సీల విషయంలో కొన్ని రకాల నిబంధనలు ఉన్నాయి. సామాజిక, కళాత్మక, సేవా రంగాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి రావడం వల్ల ఒక విధంగా సవాల్ అని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి పార్టీకి కష్టపడిన సీనియర్లు.. సామాజిక సమీకరణలో ప్రాధాన్యం దక్కని వర్గాలకు ఈ కోటా కింద అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే హడావిడిగా నిర్ణయం తీసుకోకుండా అర్హులైన నిపుణులను, సామాజిక సమీకరణలను పక్కాగా కుదిర్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదం ముద్ర వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి. అయితే నిబంధనల ప్రకారం వివిధ రంగాల్లో నిపుణులకు ఇవ్వాలంటే మాత్రం కుదిరే పని కాదు. ప్రస్తుతం నడుస్తోంది పొలిటికల్ వ్యూహం. రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే వారికి.. ఆ వర్గాల వారికి పదవులు ఇస్తారే తప్ప.. మిగతా వారి విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. ఈరోజు క్యాబినెట్ భేటీలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుంటే మాత్రం కొన్ని రోజులపాటు ఈ పదవులపై ఆశలు వదులుకోవాల్సిందే..