US Immigration: అమెరికాకు వలసల నియంత్రణకు ట్రంప్ సర్కార్ రోజుకో కొత్త రూల్ తెస్తోంది. ఇప్పటికే వీసా ఫీజులు భారీగా పెంచింది. సిటిజన్షిప్ను కఠినతరం చేసింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అమెరికా వెళ్లేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా అమెరికాలో ఉపాధి, ఉన్నత చదువులు లేదా ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారు చేసే దరఖాస్తులపై యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. 2026, ఆగస్టు 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం, దరఖాస్తు సమయంలోనే ప్రారంభ సాక్ష్యాలు, పూర్తి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త నిబంధన అధికారులు అదనపు సమాచారం కోరకుండానే నేరుగా తిరస్కరించవచ్చు.
అర్హత నిరూపించాలి
దరఖాస్తుదారులు తమ అర్హతను దాఖలు చేసే సమయంలోనే స్పష్టంగా చూపించాలి. ఆ అర్హత నిర్ణయ ప్రక్రియ అంతా కొనసాగాలి. ఫారమ్ సూచనల్లో పేర్కొన్న పత్రాలు, సాక్ష్యాలు తప్పనిసరిగా జతచేయాలి. అధికారులు ముందుగా సమర్పించిన వివరాలు పరిశీలించి ఆమోదం, అదనపు సమాచార అభ్యర్థన లేదా తిరస్కరణలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఈ మార్పు ఉపాధి వీసా, గ్రీన్ కార్డ్ అభ్యర్థనలు, ఉపాధి అనుమతి, స్థితి మార్పు లేదా పొడిగింపు దరఖాస్తులకు వర్తిస్తుంది. ప్రత్యేకంగా హెచ్–1బీ, ఎల్–1, ఓ–1, ఓపీటీ, స్టెమ్ ఓపీటీæ, హెచ్–4 ఉపాధి అనుమతి వంటి వాటికి సరైన ఫారమ్లు, సరైన రుసుములు, అవసరమైన అన్ని మద్దతు పత్రాలు మొదటి నుంచే ఉండటం కీలకం.
అదనపు సమాచారం ఇక ఆటోమేటిక్ కాదు..
అధికారులకు ఇంకా ఆర్ఎఫ్ఈ లేదా నోయిడ్ జారీ చేసే అధికారం ఉంది. అయితే అది పూర్తిగా వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అసంపూర్ణ దాఖలుకు తప్పనిసరిగా అవకాశం ఇస్తారని భావించకూడదు. గత విధానం కారణంగా అధికారులు లోపభూయిష్ట కేసులను తిరస్కరించకుండా ఉండేవారు. ఫలితంగా ప్రాథమిక సాక్ష్యాలు లేని లేదా చట్టపరమైన ఆధారం లేని దాఖలులకు కూడా ఆర్ఎఫ్ఈలు వెళ్లేవి. కొందరు ‘‘ప్లేస్హోల్డర్’’ దరఖాస్తులు దాఖలు చేసి, పెండింగ్ కాలంలో తాత్కాలిక ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడింది. అనవసరమైన నోటీసులు ప్రాసెసింగ్ సమయాలను పెంచి, బ్యాక్లాగ్లను పెంచి, పరిపాలనా ఖర్చులను పెంచాయని సంస్థ పేర్కొంది.
కాలపరిమితుల్లో మార్పులు
ఆర్ఎఫ్ఈకి గరిష్టంగా 12 వారాల సమయం ఇవ్వవచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ పూర్తి కాలం ఇవ్వాల్సిన అవసరం లేదు. అభ్యర్థించిన సాక్ష్యం స్వభావాన్ని బట్టి తక్కువ గడువు నిర్ణయించవచ్చు. నోయిడ్కు గరిష్టంగా 30 రోజులు మాత్రమే. సాధారణంగా ఆ గడువును పొడిగించరు. తపాలా ద్వారా అందించినప్పుడు మూడు అదనపు రోజులు కేటాయిస్తారు. విదేశాల నుంచి పంపిన కొన్ని నోటీసులకు గతంలో ఇచ్చిన 14 రోజుల అదనపు సమయం ఇక ఉండదు.
పెండింగ్ దరఖాస్తులపైనా ప్రభావం
ఈ నిబంధన కొత్త దాఖలులకు మాత్రమే కాదు. 2026 ఆగస్టు 5 నాటికి ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్హత కలిగిన కేసులకు కూడా వర్తిస్తుంది. అసలు దాఖలులో తప్పనిసరి సాక్ష్యాలు లేవని లేదా ప్రాథమిక అర్హత నిరూపించబడలేదని అధికారులు భావిస్తే నేరుగా తిరస్కరించే అవకాశం ఉంది.
సరైన దరఖాస్తులకే ప్రాధాన్యం..
ప్రతీ చిన్న లోపానికీ దరఖాస్తు తిరస్కరించరు. అవసరమైన చోట ఆర్ఎఫ్ఈ లేదా నోయిడ్ ఇంకా జారీ కావచ్చు. అయితే అటువంటి అవకాశం లభిస్తుందని నమ్మి అసంపూర్ణ దాఖలు చేయడం ప్రమాదకరం. హెచ్–1బీ యజమానులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఓపీటీ దరఖాస్తుదారులు, గ్రీన్ కార్డ్ అభ్యర్థులు ఫారమ్ సూచనలను జాగ్రత్తగా చదివి, అన్ని మద్దతు పత్రాలను మొదటి నుంచే సమర్పించాలి. ఇమ్మిగ్రేషన్ న్యాయవాది కెవిన్ జె. ఆండ్రూస్ ప్రకారం, ఆచరణలో ప్రభావం అధికారులు ఈ విధానాన్ని ఎలా అనుసరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. తప్పనిసరి ప్రారంభ సాక్ష్యాలు లేనప్పుడు తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఆర్ఎఫ్ఈకి 12 వారాల కన్నా తక్కువ సమయం ఇచ్చే అవకాశం కూడా ఉంది. గడువులు కఠినంగా ఉన్న లేదా తాత్కాలిక ఉపాధి అనుమతి సంబంధిత కేసుల్లో అసంపూర్ణ లేదా అజాగ్రత్తగా సిద్ధం చేసిన దాఖలులు ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాయి.
యూఎస్సీఐఎస్ ఈ మార్పుతో అధికారుల విచక్షణను పునరుద్ధరించి, పూర్తి స్థాయి దాఖలులను ప్రోత్సహించి, సరిగా సిద్ధం చేసిన కేసులు అసంపూర్ణ వాటి వల్ల ఆలస్యం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.