పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీచేసి ఓడిపోయారు. తన పార్టీ కేవలం ఒకేస్థానానికి పరిమితం అయ్యింది. అయితే.. చాలా మంది ఈ సీట్లను చూస్తున్నారు తప్ప, ఆయనకు వచ్చిన ఓటింగ్ ను చూడట్లేదు. ఏపీలో జనసేనకు దాదాపు 6 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది తక్కువేం కాదు. ఈ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ.. వచ్చే ఎన్నికల నాటికి తన బలం మరింతగా పెంచుకోవాలని చూస్తున్నారు జనసేనాని.
ప్రస్తుతం జనసేనలో ఒకటి నుంచి 10 వరకు పవన్ మాత్రమే ఉన్నారు. నాదెండ్ల ఉన్నప్పటికీ.. ఆయనకు క్షేత్రస్థాయిలో భారీ రేంజ్ లేదన్నది జనాభిప్రాయం. దీంతో.. పవన్ ఒక్కడే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అందువల్ల రాష్ట్రం మొత్తంలో క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉందనేది గుర్తించడం ఇబ్బందిగా మారిందట. వాస్తవానికి కూడా ఇది కష్టమే. కింది స్థాయి నేతల నుంచి ఖచ్చితమైన రిపోర్టు పవన్ కు అందట్లేదని తెలుస్తోంది.
అందుకే.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నట్టు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. అంటే.. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, నష్టాలను సరిచూసుకొని, మళ్లీ రిపీట్ కాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్న పవన్.. మూడేళ్ల ముందు నుంచే ఎన్నికల యుద్ధం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా.. ముందుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? అన్నది తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారట. అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన బలం ఎక్కడెక్కడ ఎంత ఉంది? ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో ఉన్నాం? ప్రజల నాడి ఏంటీ? అనే వివరాలు తెలుసుకునేందుకు నిర్ణయించారని సమాచారం. అదే సమయంలో మిత్రపక్షం బీజేపీ పరిస్థితి ఏంటీ? బలం ఎంత? వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగితే చేకూరే ప్రయోజనం ఎంత? అనే డేటా కూడా తెప్పించుకోవాలని చూస్తున్నారట.
ఈ మేరకు ఓ వ్యూహకర్తను కూడా నియమించుకోవాలని చూస్తున్నారట. అదే సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికతో ఒప్పందం చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. పైన పేర్కొన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు చూస్తున్నారట. గత ఎన్నికల పరాభావం ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావొద్దని గట్టిగా డిసైడ్ అయ్యారట. మరి, ఏం జరుగుతుంది? పవన్ ముందస్తు ప్రణాళికలు ఎంత మేర ఫలితాలను ఇస్తాయన్నది చూడాలి.