
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కేసులో హైకోర్టు తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింప చేసిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పుతో మరోమారు అవగతమైందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి, రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయన్నారు.
కరోనాతో ప్రజలు ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలని చెప్పారు. అధికార యంత్రాంగం పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలని, లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.