ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక హఠాన్మరణం చెందడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారి కోడలు సుహారిక మృతి కలచివేసిందని పేర్కొన్నారు. చిన్నవయసులోనే ఆమె మరణించడం బాధాకరమని, అప్పటివరకు స్నేహితులతో ఉత్సాహంగా గడిపి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలు విడవడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. ఈ ఘటన కన్నా గారి కుటుంబానికి, ముఖ్యంగా సుహారిక భర్త ఫణీంద్రకు ఊహించని విపత్తు వంటిదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాదం నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ఇతర కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుహారిక మృతికి తన తరఫున, జనసేన తరఫున పవన్ సంతాపం వ్యక్తం చేశారు.