Nara Lokesh Arrest: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద దుమారం రేగింది. ప్రతిపక్ష నేతలను అక్రమంగా అడ్డుకుంటూ నిర్బంధంలో పెట్టడంపై మండిపడ్డారు. అనుమతుల పేరు చెప్పి అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారీ భద్రత మధ్య లోకేష్ ను విజయవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. అనుమతుల పేరుతో ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని వాపోయారు.
లోకేష్ ఎంత మొత్తుకున్నా పోలీసులు మాత్రం వినలేదు. ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ నరసరావుపేట పర్యటనపై టెన్షన్ నెలకొంది. తెల్లవారు జాము నుంచే పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు టీడీపీ నేతలు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో నేతల మధ్య తోపులాట సైతం చోటుచేసుకుంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నరసరావుపేట పర్యటనకు వెళ్తున్న లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పరామర్శ కోసం వెళుతున్న ప్రతిపక్ష నేతను పోలీసులు నిబంధనల పేరుతో అడ్డుకోవడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి వెళ్లకున్నా తనను అడ్డుకుంటే అది ప్రభుత్వ తప్పిదమే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా నడుచుకుంటున్న వారిపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం ఏమిటని ప్రశ్నించారు.పోలీసులు ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకే లోకేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.