Homeఆంధ్రప్రదేశ్‌ఆ కేసులో మోపిదేవికి శిక్ష తప్పదా..!

ఆ కేసులో మోపిదేవికి శిక్ష తప్పదా..!

Mopidevi Venkata Ramana Rao
ఎన్నికల నిబంధనలు వ్యతిరేకించారనో.. మరేవైనా రూల్స్‌ అతిక్రమించారనో ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు కావడం కామన్‌. ఆ కేసులను హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తుంటుంది. అయితే.. ఇప్పుడు వరుసగా జరుగుతున్న విచారణల్లో చాలా వరకూ కేసులను కొట్టేస్తోంది. అవన్నీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులే కాగా.. ఓటుకు నోటు.. లిక్కర్ స్కాం లాంటి కేసుల్లో మాత్రం అభియోగాల నమోదు.. సాక్ష్యాల నమోదు చేస్తున్నారు.

లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసింది. ఈ కారణంగా ఏపీలో కొంత మంది నేతల్లో ఉలికిపాటు ప్రారంభమైంది. దీనికికారణం ఈ లిక్కర్ స్కాంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు నిందితుడిగా ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణపై జగన్ అక్రమాస్తుల కేసే కాదు..మద్యం సిండికేట్ల నుంచి లంచం పుచ్చుకున్న కేసు కూడా ఉంది. ఈ రెండూ విచారణలో ఉన్నాయి. వైఎస్ హయాంలో మోపిదేవి ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. తర్వాత కిరణ్ సీఎం అయిన సమయంలో మద్యం సిండికేట్ వ్యవహారం వెలుగుచూసింది.

రాజకీయ నాయకులు, ఎక్సైజ్, పోలీస్, మీడియా ఇలా వివిధ వర్గాలవారికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బు అందుతోందని ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌‌లో ఈ వ్యవహారం బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులకు కిరణ్ ఆదేశించారు. వందమందికిపైగా శాసనసభ్యులు, పది నుంచి ఇరవై మంది మంత్రులు, కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా పార్టీలతో సంబంధం లేకుండా అంతా పంచుకు తిన్నారని దర్యాప్తులో వెల్లడైంది.

అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు ఏకంగా మద్యం సిండికేట్ల పంచాయతీ తీర్చి పది లక్షల రూపాయల లంచం తీసుకున్నారని ఓ నిందితుడు చెప్పాడు. అది కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలోనే రాశారు. అప్పుడు మోపిదేవి పదవిలోనే ఉన్నారు. అప్పట్లో పీసీసీ చీఫ్‌గా బొత్స ఉన్నారు. ఆయన మద్యం సిండికేట్‌లో కీలకంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఆయన పేరు ఇందులో రాలేదు. తర్వాత మోపిదేవి జగన్ పార్టీలో చేరారు. ఈ కేసుకు సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవిని అప్పట్లో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. 2015లో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు లిక్కర్ సిండికేట్ స్కాం కేసులో సాక్షుల నుంచి కోర్టు స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేశారు. ఆ విచారణ తర్వాత కేసు ఎటు మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular