ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా చెప్పే నటుడు, రాజకీయనాయకుడు మోహన్ బాబుది విచిత్రమైన క్యారెక్టర్. తన మనసులోని మాటలను దాచుకోకుండా బయట పెట్టడం ఆయనకు అలవాటు. అలాంటి ఆయన మన నేతల గురించి తనలోని అభిప్రాయాలను పంచుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి నేటి లోకేష్ వరకు అనేక విషయాలు వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన నన్ను రాజ్యసభకు పంపించారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తనకు ద్రోహం చేశారని వాపోయారు.
2019లో వైసీపీలో చేరారు. జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ఏదో పదవి ఇస్తారని ఆశించినా తరువాత మొండిచేయి చూపించడంతో ఖంగు తిన్నారు. కొద్ది కాలంగా ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా సన్ ఆఫ్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఏదైనా కుండబద్దలు కొట్టే మోహన్ బాబు మన నేతల మనోగతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ నేపథ్యం గురించి చెబుతూ వాజ్ పేయి తాను ఒకే కారులో ప్రచారానికి వెళ్లామని గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తాను అభిమానించే అన్న ఎన్టీఆర్ తనను రాజ్యసభకు పంపినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్నారన్నారు. తామిద్దరం బ్రదర్ అంటూ పిలుచుకునే వాళ్లం అని అన్నారు. అప్పుడప్పుడు ఆయన మా ఇంటికి వచ్చేవారని గుర్తు చేసుకున్నారు.
రాజకీయంగా తన మనసు గాయపరిచింది మాత్రం చంద్రబాబు అని అన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తనదేనని వ్యాఖ్యానించారు. ఈ సంస్థలో తన డబ్బు తన షేర్ ఎక్కువని చంద్రబాబుది తక్కువని పేర్కొన్నారు. హెరిటేజ్ లో తన డబ్బు ఇంత, చంద్రబాబుది ఇంత, వేరే వ్యక్తిది ఇంత అని వివరించారు. హెరిటేజ్ వాటాల విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది.