దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరమవుతోంది. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రెండు పర్యాయాలు ఆప్ అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించింది. అయితే హోంశాఖ మాత్రం కేంద్రం ఆధీనంలో ఉండడంతో కొన్ని సార్లు బీజేపీ, ఆప్ ల మధ్య వార్ సాగేది. అయితే ఇటీవల కేంద్రం ఢిల్లీని చేజిక్కించుకునే పని చేసింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మోడీ ఆ రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వ సవరణ చట్టం -2021 ప్రకారం మోడీకి ఢిల్లీ రాష్ట్రంపై పరోక్షంగా కొన్ని అధికారాలు రానున్నాయి. దీంతో ఇక్కడి సీఎం కేజ్రీవాల్ నామమాత్రంగానే పాలన సాగించనున్నారు.
ఢిల్లీకి రాష్ట్ర హోదా ఉన్నా కొన్ని ముఖ్యమైన అధికారాలు మాత్రం కేంద్రం చేతిలోనే ఉన్నాయి. భూమి సంబంధిత, పోలీసు శాఖలన్నీ కేంద్ర ప్రభుత్వంతోనే సాగేవి. అయితే కొత్తగా మరికొన్ని అధికారాలను కేంద్రం చేజిక్కించుకుంది. ప్రభుత్వ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా లాంటి శాఖలు ఇప్పుడు సెంట్రల్ పరిధిలోకి వెళ్లాయి. ఢిల్లీ సీఎం ఈ శాఖలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్ట్నెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా మారింది.
ఢిల్లీపై ఆధిపత్యం చెలాయించడానికి మోడీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా సాధ్యం కాలేదు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సవరణ చట్టాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మోడీ పలు నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో మోడీ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని యత్నించాడు.అయితే అప్పుడు హైకోర్టు అడ్డుకుంది. అయితే ఇప్పుడు చట్టాన్నే మార్చడంతో మార్గం సుగమం అయింది.
తాజాగా సవరణ చేసిన చట్టం ప్రకారం ఢిల్లీకి రారాజు లెఫ్టినెంట్ గవర్నరే అని చెప్పాలి. అయితే ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో మోడీ పాగా వేయడానికి ఎన్నో ప్రయత్రాలు చేసి సఫలమయ్యారు. అయితే ఢిల్లీలో సాధ్యం కావడం లేదు. ఆప్ ప్రభుత్వం మోడీకి కంట్లో నలుసులాగా మారింది. దీంతో ప్రభుత్వ సవరణ చట్టం ద్వారా మోడీ అనుకున్నది సాధించాడు.